తెదేపా తిరిగి అధికారంలోకి రానుందా?

posted on: May 14, 2014 11:00AM

 

తెలుగుదేశం పార్టీ గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నపటికీ, ఇటీవల జరిగిన మున్సిపల్, యంపీటీసీ. జెడ్.పీ.టీ.సీ. ఎన్నికలలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. పట్టణ ప్రాంత ఓటర్లు తెదేపాకు, గ్రామీణ ప్రాంత ఓటర్లు వైకాపావైపు మొగ్గు చూపవచ్చనే విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ అత్యధిక శాతం ప్రజలు తెదేపా వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈ ఫలితాలు రూడి చేసాయి. జగన్మోహన్ రెడ్డి, షర్మిల, విజయమ్మల సభలకు, రోడ్ షోలకు అన్ని ప్రాంతాలలో మంచి స్పందన కనబడినప్పటికీ, అది ఓట్లుగా మారలేదని ఈ ఫలితాలు స్పష్టం చేసాయి.

 

వైకాపా ప్రభావం అది బలంగా ఉన్న కడప, కర్నూలు మరియు నెల్లూరు జిల్లాలకే పరిమితమని ఈ ఫలితాలు తెలియజేసాయి. జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు సానుభూతి చూపుతున్నపటికీ, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని అనుభవరహితుడు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని చేతిలో పెట్టేందుకు సిద్దంగా లేరని అర్ధమవుతోంది. అందువల్ల సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిష్పత్తిలో సార్వత్రిక ఫలితాలు వచ్చినట్లయితే, తెదేపా ప్రభుత్వ ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ, భారీ మెజార్టీ మాత్రం రాకపోవచ్చును.

 

ఈ మూడు ఎన్నికలు కూడా తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు కుదుర్చుకోక ముందు జరిగినవే గనుక, ఇది చంద్రబాబు సమర్ధకు, అనుభవానికి ప్రజలు వేసిన ఓటుగానే భావించవచ్చును. ఈ స్థానిక ఎన్నికల తరువాత తెదేపా విజయావకాశాలు గల బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నందున అది కూడా తెదేపాకు సానుకూలాంశంగా మారవచ్చును. మంచి సమర్ధులు, పరిపాలనాదక్షులు అని పేరుగాంచిన నరేంద్ర మోడీ, చంద్రబాబుల కాంబినేషన్ లో దేశం, రాష్ట్రం రెండూ కూడా మంచి ప్రగతి సాధించే అవకాశం ఉందని ప్రజలు విశ్వసిస్తునందున సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో కూడా సీమాంధ్ర ప్రజలు తెదేపావైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...