కత్తి కార్తీకకు బెదిరింపులు.. దుబ్బాకలో పోటీ చేస్తే సజీవంగా కాల్చి చంపుతాం

దుబ్బాక ఉప ఎన్నికల బరిలోకి దిగితే చంపేస్తామంటూ బిగ్ బాస్ ఫేం కత్తి కార్తీకకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.

 

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలు ఈ ఉపఎన్నికల్లో గెలవడం కోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇదిలా ఉంటే, ఈ స్థానం నుంచి కత్తి కార్తీక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో గత నెల రోజులుగా కార్తీక దుబ్బాకలో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకొంటున్నారు. అయితే, ప్రచారంలో దూసుకెళ్తున్న కార్తీకకు ప్రత్యర్థి వర్గాల నుంచి పరోక్షంగా బెదిరింపులు ఎదురయ్యాయి. అన్నీ సర్దుకొని హైదరాబాద్‌కు వెళ్లిపోవాలని, లేదంటే సజీవ దహనం చేస్తామని దుండగులు హెచ్చరించారని కత్తి కార్తీక వెల్లడించారు. 

కార్తీక డ్రైవర్ షరీఫ్ ద్విచక్ర వాహనంపై గురువారం హైదరాబాద్ నుంచి దుబ్బాకకు వస్తున్న క్రమంలో.. రామాయంపేటలోని అడిగాస్ హోటల్ దగ్గర ఓ ఇన్నోవాలో వచ్చిన నలుగురు వ్యక్తులు డ్రైవర్‌ను అడ్డగించారు. "నువ్వు కత్తి కార్తీక డ్రైవర్‌వు కదా. కార్తీకతో పాటు నువ్వు కూడా అన్నీ సర్దుకొని హైదరాబాద్ పారిపోండి. లేదంటే సజీవంగా కాల్చివేస్తాం." అని హెచ్చరించారు. దీంతో భయపడిపోయిన డ్రైవర్ బైక్ అక్కడే వదిలిపెట్టి పొలాల్లోకి పరుగెత్తి.. వెంటనే కత్తి కార్తీకకు ఫోన్ చేసి చెప్పగా వెంటనే ఆమె బయలుదేరి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు బెదిరింపులు ఎదురయ్యాయని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.