12 మంది బాలికలపై అత్యాచారం కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

posted on: Jan 7, 2022 8:06AM

వసతి గృహంలో 12 మంది బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడిని దోషిగా తేల్చిన నల్గొండ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. అలాగే అతడికి సహకరించిన వసతిగృహ నిర్వాహకుడికి కూడా  జీవిత ఖైదు విధించగా,  నేరాన్ని దాచిన ఓ మహిళకు ఆర్లెళ్ల జైలు శిక్షను విధిస్తూ.. నల్లగొండ జిల్లా ఒకటో అదనపు సెషన్స్‌ కోర్టు తీర్పునిచ్చింది.

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ఏనమీదితండాలో గుంటూరు జిల్లా నాగారానికి చెందిన భార్యాభర్తలు నున్నం శ్రీనివాసరావు, సరిత కలిసి విలేజ్ రీ కన్‌స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (వీఆర్ఓ) అనే ప్రైవేటు సంస్థను స్థాపించి బాలికల వసతిగృహాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులోని బాలికలకు చదువు చెప్పేందుకు రమావత్ హరీశ్ నాయక్‌ను ట్యూటర్‌గా నియమించారు. ఈ క్రమంలో హరీశ్ మూడు నెలలపాటు 12 మంది బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  విషయం బయటకు చెప్పినా, ఎదురు తిరిగినా చంపేస్తానని బెదిరించాడు. నిందితుడు హరీశ్‌కు నిర్వాహకులైన శ్రీనివాస్, అతడి భార్య సహకరించారు.

3 ఏప్రిల్ 2014న బాధిత బాలిక ఒకరు తనపై జరిగిన దారుణాన్ని వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించడంతో మరిన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మొత్తం 12 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. దీంతో మొత్తం 12 మంది బాలిక ఫిర్యాదు మేరకు 12 కేసులు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం మొత్తం 12 చార్జ్‌షీట్లు దాఖలు చేయగా, కోర్టు విచారణలో 10 కేసుల్లో నేరం నిర్ధారణ అయింది. హరీశ్, శ్రీనివాసరావులను దోషులుగా తేల్చిన న్యాయస్థానం వారిద్దరికీ జీవిత ఖైదు, రూ. 10 వేల చొప్పున జరిమానా విధించింది. అలాగే, బెదిరింపులకు పాల్పడినందుకు హరీశ్‌కు మరో రెండేళ్లు, అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్గొండ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నాగరాజు  తీర్పు చెప్పారు. 

ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో వెలుగులోనికి వచ్చిన ఈ ఘటన అసెంబ్లీని కుదిపేసింది. అప్పటి జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఈ కేసును సీరియ్‌సగా తీసుకున్నారు. అప్పటి మిర్యాలగూడ డీఎస్పీ(ప్రస్తుతం ఖమ్మం అదనపు ఎస్పీ) సుభాష్‌ చంద్రబోస్‌, హాలియా సీఐ(ప్రస్తుతం దేవరకొండ డీఎస్పీ) ఆనంద్‌రెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌(ప్రస్తుతం ఏఎస్సై) వెంకట్‌రెడ్డి ఈ కేసును ఛేదించి, హరీశ్‌నాయక్‌, శ్రీనివాసరావు, సరితను అరెస్టు చేశారు. వారిపై ఐపీసీలోని 417, 420, 506, 109, 202, 354/ఏ, 376 సెక్షన్లు, పోక్సో చట్టం కింద మొత్తం 11 కేసులు నమోదు చేశారు. అదే సంవత్సరం ఏప్రిల్‌ నెలలో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కోర్టుకు పక్కా ఆధారాలను సమర్పించారు. బాధితుల పక్షాన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సిరిగిరి వెంకట్‌రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. వాదోపవాదాలు విన్న ఒకటో అదనపు సెషన్స్‌ కోర్టు జడ్జి నాగరాజు గురువారం తుది తీర్పును వెలువరించారు. ఈ తీర్పును బాధిత కుటుంబాలు, మహిళా సంఘాలు స్వాగతించాయి. ఏనమీది తండావాసులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. నిందితులకు శిక్షపడేలా చేసిన పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు నిందితులను నల్లగొండ జిల్లా జైలుకు తరలించారు. కాగా.. సరితకు ఈ కేసులో బెయిల్‌ లభించింది. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...