బోటు మునిగి 700 మంది గల్లంతు

 

లిబియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లిబియా నుంచి జర్మనీకి వలస వెళ్తున్న ఏడు వందల మంది శరణార్థులు మరణించారు. లిబియా అధ్యక్షుడు గడాఫీని అక్కడ జనం దారుణంగా చంపేసిన తర్వాత తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారు. శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయింది. ఎక్కడ చూసినా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అనేకమంది లిబియా నుంచి జర్మనీకి సముద్ర మార్గం ద్వారా వలస వెళ్తున్నారు. ఇలా వలస వెళ్ళే వారి పడవలు మునిగి ఇప్పటి వరకు మూడు వందల మంది మరణించారు. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో ఏడు వందల మంది గల్లంతయ్యారు. లిబియా తీరం నుంచి ఇటలీలోని లాంపేడ్యూసాకి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ శరణార్థులు ప్రయాణిస్తున్న బోటుకు మరో పెద్ద వ్యాపార నౌక ఎదురు వచ్చింది. ఈ బోటులో ప్రయాణించడం కంటే ఆ నౌకలో ప్రయాణించడం మంచిదని దాంట్లోవారు భావించారు. ఆ నౌక పక్కనే బోటును ఆపి అందరూ అందులో ఎక్కడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో అందరూ బోటుకు ఒకే వైపుకు రావడంతో బోటు ఒరిగిపోయి నీటిలో మునిగిపోయింది. దాంతో 700 మంది గల్లంతయ్యారు. వీరిలో 24 మందిని కాపాడారు. 28 మంది ఈదుతూ బతికిపోయారు. మిగతావారంతా నీటిలో మునిగి మరణించి వుంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన పట్ల అటు జర్మనీలో, ఇటు లిబియాలో ప్రభుత్వ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. పోప్ ఫ్రాన్సిస్ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.