ప్రాణాయామంతోనే ఆ సైనికుడి ప్రాణాలు నిలిచాయా!
posted on: Feb 10, 2016 10:45AM

గత వారం సియాచిన్లో ఏర్పడిన హిమపాతంలో 10మంది సైనికులు గల్లంతైన సంగతి తెలిసిందే! కనీసం వారి మృతదేహాలన్నా వెలికితీయాలని అక్కడి భారతీయ సైనికులు సాగించిన వెతుకులాటలో ఒక అద్భుతం వెలికి చూసింది. హనుమంతప్ప అనే ఒక సైనికుడు ఇంకా ప్రాణాలలతోనే ఉండటం ప్రపంచాన్నే ఆశ్చర్యపరచింది. దాదాపు 35 అడుగుల లోతున మంచులో కూరుకుపోయిన హనుమంతప్ప, అయిదురోజుల పాటు ప్రాణాలను నిలుపుకోగలిగాడు. 20,000 అడుగుల ఎత్తున ఉండే సియాచిన్ పర్వతాల మీద ఆ సమయంలో -40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఆ పరిస్థితులలో అయిదు రోజులు కాదు కదా! అయిదు గంటలు కూడా మంచులో ఉండటం సాధ్యం కాదు. ఎలాంటి ఆహారం కూడా లేకుండా హనుమంతప్ప అయిదు రోజుల పాటు సజీవంగా ఉండటం ఇప్పడు వైద్యులని సైతం ఆశ్చర్యపరుస్తోంది. హనుమంతప్ప యోగాలో నిష్ణాతుడు కావడమే అతని ఊపిరికి కారణమంటున్నారు అతని సహచరులు. హనుమంతప్ప ప్రాణాయామంలో దిట్ట అట. కేవలం తాను యోగాసనాలను వేయడమే కాకుండా, తన సహచరులకు కూడా యోగాను నేర్పించేవాడట. యోగా చేయడం వల్ల అలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే శారీరక సామర్థ్యమే కాకుండా, మానసిక స్థైర్యం అలవడుతుందనీ... అందుకు హనుమంతప్ప సంఘటనే ఉదాహరణ అనీ యోగా గురువులు పేర్కొంటున్నారు. ఈ దెబ్బతో యోగా వైభవం మరోసారి ప్రపంచం ముందుకి వచ్చినట్లైంది.



.jpg)
.jpg)


