ఎన్టీఆర్ని చంపి యథేచ్ఛగా తిరుగుతున్నారు
posted on Jan 18, 2019 11:59AM
ఎన్టీఆర్ 23వ వర్థంతి సందర్భంగా ఆయనకు వైసీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఘాట్ లో నివాళి అర్పించారు. అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఎప్పటికి తెలుగు వారి గుండెల్లో ఆరాధ్యుడే అని కొనియాడారు. కానీ తన గుండెల్లో మంట చల్లారలేదని, కళ్లలో నీరు ఇంకా ఇంకలేదని ఆవేదనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించలేదని, ఆయన ఆత్మ ఘోషిస్తుందని వాపోయారు. ఎన్టీఆర్ను చంపిన వాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మహిళలను ఎంతో గౌరవించేవారని.. కానీ నేటి టీడీపీ నేతలు మహిళల పట్ల చాలా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ ఘాట్ను కూడా సరిగా పట్టించుకోవడం లేదని.. పెచ్చులూడుతున్నాయని తెలిపారు. ఇది ఎన్టీఆర్కు అవమానం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని గమనించి ఘాట్కు మరమ్మతులు చేయించాలని కోరారు.