జేపీ నడ్డా.. కేరాఫ్‌ ఎర్రగడ్డ.. బీజేపీ అంటే 'బక్వాస్‌ జుమ్లా పార్టీ'

posted on: Jan 5, 2022 5:05PM

జేపీ నడ్డా.. అబద్ధాల అడ్డా.. నీ కేరాఫ్‌ అడ్రస్‌ ఎర్రగడ్డ..  బండి సంజయ్‌కు జేపీ నడ్డాకు తేడా లేదు. బీజేపీ అంటే భారతీయ జనతాపార్టీ కాదు.. బక్వాస్‌ జుమ్లా పార్టీ.. అంటూ కేటీఆర్ ఘాటు ప‌ద‌జాలంతో విమ‌ర్శించారు. సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ కాదు... సబ్‌కా సాత్‌ సబ్‌కా వినాశ్ అనేలా బీజేపీ వ్యవహరిస్తోందిని మండిప‌డ్డారు. 

మంగ‌ళ‌వారం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా హైద‌రాబాద్ వ‌చ్చి సీఎం కేసీఆర్‌ను విమ‌ర్శ‌ల‌తో కుమ్మేశారు. బుధ‌వారం కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి జేపీ న‌డ్డాపై విరుచుకుప‌డ్డారు. చెడామ‌డా మాట‌ల‌తో కుళ్ల‌బొడిచారు. న‌డ్డాను.. బీజేపీని.. ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఇంత‌కీ కేటీఆర్ ఏమ‌న్నారంటే....

వడ్ల నుంచి కంటోన్మెంట్‌లో రోడ్ల వరకు కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసింది. కాళేశ్వరంలో అవినీతి లేదని కేంద్రమే పార్లమెంట్‌లో చెప్పింది. కాళేశ్వరం విషయంలో మీకు మెంటల్‌ బ్యాలెన్స్‌ తప్పిందా? మీ కేంద్ర మంత్రికి తప్పిందా? మీరే తేల్చుకోవాలి. నీతి ఆయోగ్‌కు ఉన్న నీతి కూడా నడ్డాకు లేదన్నారు కేటీఆర్‌.

తెలంగాణ‌లో కుటుంబ పాలన అని న‌డ్డా విమర్శలు చేస్తున్నారు.. అమిత్‌ షా కుమారుడికి బీసీసీఐ పదవి ఎలా వచ్చింది? గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసింది బీజేపీ కాదా? ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే.. రోడ్డుపై మేకులు కొట్టించిన బీజేపీ నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రైతుల రక్తం కళ్లజూసిన ప్రభుత్వం మీదంటూ కేటీఆర్ విరుచుకుప‌డ్డారు.  

ఏడున్నరేళ్లలో దేశానికి బీజేపీ చేసింది శూన్యం. వ్యవస్థను, మీడియాను గుప్పిట్లో పెట్టుకుని.. మీడియాను మోడియాగా మార్చారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారు. కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు.. బీజేపీ, ఈడీ, ఎన్‌ఐఏ, సీబీఐ.. అంటూ సెటైర్లు వేశారు కేటీఆర్‌.  

ప్ర‌ధాని పేరు నరేంద్రమోదీ కాదు.. రైతు విరోధి అన్నారు. పంజాబ్‌లో రైతుల నిరసనకు దిగడంతో 30 నిమిషాల పాటు రోడ్డుపైనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చరిత్రలో ప్రధానిని 30 నిమిషాల పాటు రోడ్డుపై నిలబెట్టిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా? అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...