కృష్ణ జలాల కోసం టిడిపి పోరుబాట

 

కృష్ణాజలాల పంపిణీ విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ యుద్దం ప్రకటించింది. తెలుగు రైతులకు అశనిపాతంలా మారిన ఈ తలతిక్క తీర్పుకు వ్యతిరేకంగా టిడిపి ఆందోళనలకు రెడీ అవుతుంది. బ్రిజేష్‌కుమార్‌ కమిటీ ఇచ్చిన తీర్పు ప్రకారం ఇకపై ఎగువ రాష్ట్రాల వారి దయతోనే మనకు పంటలు పండే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో తెలుగువారి తరుపున పోరాడటానికి టిడిపి పార్టీ సిద్దమవుతుంది.

బ్రిజేష్‌కుమార్‌ కమిటీ తీర్పుతో పాటు, తెలంగాణ ఏర్పాటు వల్ల కలగబోయే నష్టాలను జాతీయ స్థాయిలో అందరి దృష్టికి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు త్వరలో ఢిల్లీ వెల్లనున్నారు, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో పాటు పలువురు జాతీయనాయకులతో ఆయన ఈ సమస్యలపై చర్చించనున్నారు.

అదే సమయంలో ఇటు రాష్ట్రంలోనూ ప్రత్యక్ష పోరాటం చేసేందుకు ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ నెల నాలుగో తేదీన ధర్నాకు సిద్ధమవుతున్నారు. బ్రిజేష్ తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఆదివారం రాత్రి లేఖ రాశారు.