జగన్ పార్టీకి బ్యాడ్ న్యూస్: కొత్తపల్లికి సీరియస్!

 

 

 

జగన్ పార్టీకి మరో బ్యాడ్ న్యూస్ ఎదురైంది. ఇప్పటికే భూమా శోభా నాగిరెడ్డి మరణంతో విషాదంలో వున్న పార్టీకి ఇప్పుడు మరో సమస్య ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి జగన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడుకు గుండె, శ్వాసకోశానికి సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వైద్యులు తెలిపారు. గత ఏడాది కొత్తపల్లి సుబ్బారాయుడు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయనకు మరింత మెరుగైన చికిత్సతోపాటు విశ్రాంతి కూడా చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు. కొత్తపల్లికి సీరియస్‌గా వుండి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో వున్నప్పటికీ, ఆయన నియోజకవర్గంలో మాత్రం ప్రచారం ఆగలేదు. ఆయన బంధువులు, సన్నిహితులు కొత్తపల్లి తరఫున ప్రచారం నిర్వహిస్తూనే వున్నారు.