కోన వెంకట్‌ని దోచేశారు

 

ప్రముఖ సినిమా రచయిత కోన వెంకట్ దోపిడీ దొంగల బారిన పడ్డారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌ శివార్లలోని ప్రకాష్‌రాజ్ ఫామ్ హౌస్‌లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. వాటికి రచయిత కోన వెంకట్‌, మరికొందరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. రాత్రివేళ తిరిగి వస్తుండగా, కోన వెంకట్‌తోపాటు నిర్మాత డీవీవీ దానయ్య ప్రయాణిస్తున్న కారును కొంతమంది దొంగలు అడ్డగించారు. వారి కారు అద్దాలను పగులగొట్టి వారి దగ్గర వున్న బంగారం, డబ్బు, ఫోన్లు మొత్తం దోచుకున్నారు. దోపిడీకి గురైన సొత్తు విలువ మూడు లక్షలు వుంటుందని తెలుస్తోంది. ఈ దోపిడీని చూసి వెనుక కార్లలో వస్తున్న మరికొందరు సినీ ప్రముఖులు తమ కార్లను వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోయారని తెలుస్తోంది. ఈ దోపిడీ మీద కోన వెంకట్ షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దోపిడీ ఘటన తన జీవితంలో మరచిపోలేదని కోన వెంకట్ చెబుతున్నారు. డబ్బు పోతే పోయింది... ప్రాణాలు తీయలేదు అదే సంతోషం అని ఆయన అంటున్నారు.