TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళలు నిరసన తెలుపుతుంటే సంకరజాతి అంటారా?.. లోకేశ్ ఫైర్

Published on: Mon Jun 9, 2025 6:17PM

 

రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే, వారిని వైసీపీ నాయకులు సంకరజాతి అని అభివర్ణించడం దారుణమని  మండిపడ్డారు. "ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన?" అంటూ ఆయన వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళల పట్ల వైసీపీ నాయకులు, సాక్షి మీడియాకు చెందిన కొందరు జర్నలిస్టులు అనుసరిస్తున్న వైఖరిని మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా తప్పుపట్టారు. తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసీపీ నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడుతున్నారు. మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు! అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ నేతల ప్రవర్తన, జగన్ రెడ్డి తన తల్లిని, చెల్లిని తరిమేసిన అమానవీయ తీరును ఆదర్శంగా తీసుకున్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు. మహిళల జోలికి వస్తే, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని నారా లోకేశ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ఉందని, అలాంటి వారిని కించపరిచేలా మాట్లాడటం సహించరానిదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సజ్జల వ్యాఖ్యల వీడియోను లోకేశ్ పంచుకున్నారు.

ఇటీవల సాక్షి టీవీలో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అనే జర్నలిస్టు "అమరావతి వేశ్యల రాజధాని" అంటూ అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు సాక్షి టీవీ ప్రజెంటర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.