నేపాల్‌లో చిక్కుకున్న 65 మంది ఖమ్మం వాసులు.. చేతులెత్తేసిన ట్రావెల్స్

 

నేపాల్‌లో పర్యటించేందుకు వెళ్లిన 65 మంది ఖమ్మం వాసులు ఆ దేశంలో చిక్కుకుపోయారు. మరోవైపు వీరిని తీసుకెళ్లిన ట్రావెల్స్ సంస్థ వారిని వెనక్కి తీసుకరావడంలో చేతులెత్తేసింది. దీంతో బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిని సురక్షితంగా స్వస్థలాలకి చేర్చాలని కోరుతూ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిశారు.  దీంతో తుమ్మల ఢిల్లీలోని ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారితో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం విదేశాంగ మంత్రితోపాటు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయంతో వేణుగోపాలాచారి సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కుటుంబీకులు ఎలాంటి ఆందోళన చెందొద్దని తుమ్మల హామీ ఇచ్చారు.