వనమా నీకిది తగునా?
Published on: Wed Apr 4, 2012 6:57AM
ఖమ్మంజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరేరావుపై ఆ జిల్లాలోని మాజీ పి ఆర్ పి నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పి. ఆర్.పి.ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తరువాత వందలాది మంది పి ఆర్ పి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకోవలసి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తరువాత తమ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని జిల్లాలోని మాజీ పి ఆర్ పి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా తమను పిలవడం లేదని, ఒకవేళ పిలవని పేరంటానికి వెళ్ళినా తమను పట్టించుకోవడం లేదని పి ఆర్ పి ఖమ్మంజిల్లా మాజీ అధ్యక్షుడు యరవలి కృష్ణ, జిల్లా మాజీ అధికార ప్రతినిధి బీమా శ్రీధర్ తదితరులు బహిరంగంగానే బాధపడుతున్నారు.
వనమా వెంకటేశ్వరరావు వైఖరి చాలా దారుణంగా ఉందని ఆయన ఉద్దేశపూర్వకంగానే తమను కించపరుస్తున్నారని మాజీ పి ఆర్ పి నేతలు అంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్యకు స్వాగతం పలుకుతూ మాజీ పి ఆర్ పి నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ బ్యానర్లను వనమా అనుయాయులు చింపివేశారు. దీంతో మాజీ పి ఆర్ పి నేతలు తీవ్ర ఆవేదనకు గురై వనమా వెంకటేశ్వరరావు పై జిల్లా మంత్రులకు, పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు పంపారు. వనమా వెంకటేశ్వరరావు తమను అకారణంగా ద్వేశిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.


