కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ తో కూడా కేజ్రీవాల్ కు తలనొప్పులు.....
posted on Mar 30, 2017 11:13AM
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కొత్తగా వచ్చిన లెఫ్టినెంట్ గవర్నర్తో కూడా తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి. గతంలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తో కేజ్రీవాల్ కు రోజుకో వివాదంపై గొడవలు తలెత్తేవి. ఆ తరువాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత వచ్చిన అనిల్ బైజల్తో కూడా ఇప్పుడు తలనొప్పి మొదలైంది కేజ్రీవాల్ కు. ప్రభుత్వ ప్రకటనలలో కేజ్రీవాల్ను చూపించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రూ. 97 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంఎం కుట్టిని బైజల్ ఆదేశించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈ ప్రకటనలు ఉల్లంఘించాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రకటనలలో ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రూ. 97 కోట్లు చెల్లించడానికి పార్టీకి నెల రోజుల గడువు ఇచ్చారు. ఈ ప్రకటనలన్నింటికీ రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు చెల్లించారు. కాగా ప్రభుత్వ ప్రకటనల్లో కేవలం ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫొటోలు మాత్రమే ఉండాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.