కేసీఆర్ తో భోజనం చేసిన వారికి అస్వస్థత.. వాసాలమర్రిలో అధికారుల  హైరానా.. 

posted on: Jun 25, 2021 8:34AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించిన యాదాద్రి  భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పలువురు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. సీఎం  కేసీఆర్ దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో మంగళవారం నిర్వహించిన సహపంక్తి భోజనం చేసిన వారిలో 18 మంది అనారోగ్యానికి  గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం పక్కన కూర్చుని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ సీఎం సభ అనంతరం వాంతులు చేసుకుంది. రాత్రి మరోమారు వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను భువనగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో  గురువారం డిశ్చార్జ్  చేశారు.ఆకుల ఆగమ్మను తన దోస్త్ అని గ్రామసభలో ప్రకటించారు కేసీఆర్. ఆమె అస్వస్థతకు గురి కావడంతో అధికారులు ఆందోళన చెందారు. 

కేసీఆర్ పర్యటనలో ఏర్పాచు చేసిన సహపంక్తిలో భోజనం చేసిన ఓ బాలిక బుధవారం అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అదే రోజు డిశ్చార్జ్ చేశారు.  గ్రామానికి చెందిన మరో 16 మంది కూడా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారని తెలుస్తోంది. విషయం తెలిసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని ఇంటింటికి తిరుగుతూ వైద్యం అందించారు. గ్రామస్థుల అస్వస్థతకు ఆహారం కలుషితం కావడం కారణం కాదని అధికారులు తెలిపారు. సహపంక్తిలో మొత్తం 2500 మంది పాల్గొన్నారని, వారిలో 18 మంది మాత్రమే అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...