Latest News

కేసీఆర్ హస్తిన బాట.. అజెండా మాటున బీజేపీయేతర శక్తుల ఏకీకరణకు వ్యూహాలు

posted on: May 11, 2022 6:40AM

తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తనయుడు కేటీఆర్ కు అప్పగించేసి హస్తిన బాట పట్టనున్నారా? ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఆయన ప్రవచించిన జాతీయ అజెండా కు మద్దతు కోసం మళ్లీ ఫ్రెష్ గా ప్రయత్నాలు ప్రారంభించబోతున్నారా? ఈ ప్రశ్నలకు ఒక ప్రముఖ దినపత్రికలో ముఖ్యమంత్రి సీపీఆర్వో (ముఖ్యమంత్రి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి) వనం జ్వాలా  నరసింహరావు రాసిన వ్యాసం చదివితే ఔననే సమాధానం వస్తుంది. ఇక ఆయన రాష్ట్ర రాజకీయాలపై కాక జాతీయ రాజకీయాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించనున్నారన్నది అవగతమౌతుంది.

ఇందుకు తగ్గట్టుగానే  టీఆర్ఎస్ కార్యనర్వాహక  అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రభుత్వ కార్యక్రమాలలో అన్నిటా తానై వ్యవహరిస్తున్నారు. మంత్రులు చేయాల్సి ప్రారంభోత్సవాలను కూడా ఆయనే చేసేస్తున్నారు. ఏ హోదాలో కేటీఆర్ ఇదంతా చేస్తున్నారన్న సందేహం ఎవరికైనా కలగొచ్చేమో కానీ టీఆర్ఎస్ లో మాత్రం అలాంటి అనుమానాలు ఎవరికీ రావు. ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగం తరువాత ఒక ప్రముఖ దినపత్రికలో  సీఎం సీపీఆర్వో రాసిన వ్యాసం చదివితే.. రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ స్థాయిలో తన ముద్రవేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు భావించాల్సి వస్తుంది. 
అందుకే ఇటీవలి కాలంలో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆయా శాఖల మంత్రులతో సంబంధమే లేకుండా ప్రారంబోత్సవాలకు హాజరౌతున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల ప్రకటనలూ ఆయనే చేస్తున్నారు. ముఖ్య మంత్రి వద్ద ఉన్న శాఖల వ్యవహారాలూ ఆయన చూస్తున్నారు.

అంతే కాకుండా ఇటీవలి కాలంలో ఆయన భాషలో ప్రస్ఫుటంగా మార్పు కనిపిస్తున్నది. యాసలో కానీ, ఉపయోగించే పరిభాషలో కానీ తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ ను అనుకరిస్తున్నారు. విమర్శలలో పదును పెంచారు. తండ్రికి రాజకీయ వారసుడిగా జనంలో గుర్తింపు పొందేందుకే ఆయన తన ఆహార్యాన్ని, భాషనూ మార్చుకుంటున్నారు. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకుంటే కేసీఆర్ ఇక రాష్ట్ర రాజకీయాలకు దూరం కావడం ఖాయమేననిపించక మానదు. టీఆర్ఎస్ సీనియర్లు కూడా అంతర్గత సంభాషణల్లో ఇదే విషయాన్ని చెబుతున్నారు.  వారి మాటల ప్రకారం..ప్రస్తుతం ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్, ఈ నెల 14వరకూ అక్కడే ఉంటారు. ఆ తరువాత ఆయన హస్తిన బాట పట్టే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. 

జాతీయ అజెండా అంటూ తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశ వ్యాప్తం చేయాలన్న లక్ష్యాన్ని ప్రకటించినా.. కేసీఆర్ వ్యూహం  మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీయేతర శక్తుల ఏకీకరణేననీ, దానికి ఫంట్ర్ లు, కూటములు అంటూ రాజకీయ భాష వాడకుండా జాతీయ అజెండా నామకరణం చేశారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అజెండా పేరిట బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తీసుకువస్తే... ఎన్నికల తరువాత ఫలితాలను బట్టి చక్రం తిప్పే అవకాశం ఉంటుందని ఆయన భావనగా చెబుతున్నారు.  ఏది ఏమైనా మొత్తం మీద  ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తారని అంటున్నారు. ఇందుకు ఆయన మీడయా మద్దతు కూడగట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక ప్రముఖ దినపత్రికలో సీఎం సీపీఆర్వో కేసీఆర్ ఆలోచనలు, లక్ష్యాలను వివరిస్తూ రాసిన సుదీర్ఘ వ్యాసం అని  విశ్లేషిస్తున్నారు. జాతీయ రాజకీయాలలో తన ప్రాభవాన్ని పెంచుకోవడానికి ప్రాంతీయ పత్రికల మద్దతు సరిపోదు కనుక ఆయన జాతీయ మీడియాలో తన అజెండా ప్రత్యేకతలు ప్రసారం కావాలని భావిస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఢిల్లీలో తన పీఆర్వోను నియమించారు. ఆయన ద్వారా జాతీయ మీడియాలో కూడా తన ప్రస్తావన ప్రముఖంగా వచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే  కొన్ని జాతీయ చానెళ్లలో కేసీఆర్ ప్రతిపాదించిన జాతీయ అజెండాపై ప్రముఖంగా వార్తా కథనాలు ప్రసారమవ్వడాన్ని ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు చూపుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...