కేసీఆర్ హ్యాట్రిక్
posted on: Jan 31, 2026 2:38PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హ్యాట్రిక్ కొట్టారు. వాస్తవానికి తెలంగాణ ఆవిర్బావం తరువాత రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చిన ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్టీని విజయం దిశగా నడిపించి ముచ్చటగా మూడో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ తహతహలాడారు.
అయితే ముచ్చటగా మూడో సారి సీఎం కావాలన్న కేసీఆర్ కలలు, ఆశలు నెరవేరలేదు. మరి ఇప్పుడు కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఏమిటనుకుంటున్నారా? అక్కడికే వద్దాం. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వరుసగా మూడు కేసులలో నోటీసులు అందుకుని హ్యాట్రిక్ కొట్టారు. తెలంగాణలో బిఆర్ఎస్ గద్దె దిగి కాంగ్రెస్ అధికార పీఠం దక్కించుకున్న ఈ రెండేళ్ల కాలంలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడు కేసులలో నోటీసులు అందుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి మూడు కేసుల విషయంలో అధికారుల నుండి నోటీసులు అందుకుని హైట్రిక్ కొట్టారనే చెప్పాలి.
మొదటగా బిఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ నియమించిన జ జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ కేసీఆర్ కి విాచారణకు హాజరు కావాల్సిందిగా టీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై కేసీఆర్ హైకోర్టు ను ఆశ్రయించి విచారణకు హాజరు కాలేదనుకోండి అది వేరే సంగతి.
ఇక రెండో నోటీసు గత బిఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు విషయంలో కేసీఆర్ అందుకున్నారు. విచారణకు హాజరయ్యారు కూడా. ఇక ఇప్పుడు తాజాగా ఫోన్ టాపింగ్ కేసు విచారణ నిమిత్తం కేసీఆర్ సిట్ నోటీసులు అందుకున్నారు. ఈ విధంగా కేసీఆర్ మూడు కేసుల్లో మూడు నోటీసులు అందుకుని హ్యాట్రిక్ సాధించారని నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు.



.webp)





