TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరుల కుటుంబాలకు కల్వకుంట్ల కవిత బహిరంగ క్షమాపణ

Published on: Sat Oct 25, 2025 12:39PM

తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన అమరులకు సరైన న్యాయం చేయలేకపోయానంటూ కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం నుంచి జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమో జనం బాట పట్టడానికి ముందు నాంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించారు.

ఆ సందర్భంగా మాట్లాడిన కవిత ఉద్యమకారులను న్యాయం చేయడంలో విఫలమయ్యానని అంగీకరించారు. అమరవీరుల కుటుంబాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు.  ఇక నుంచి తన పోరాట పంథా మారుతుందన్నారు. జాగృతి జనం బాట యాత్రలో అందరినీ కలుస్తానని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరుల అయ్యారని గుర్తు చేసుకున్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేర్చడంలో ఎంత వరకు ముందుకు వెళ్ళామో ఆలోచించుకోవాలన్నారు.  తెలంగాణ  కోసం 1200 అమరులు అయ్యారనీ, అయితే ఆ అమరవీరుల కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయామని కవిత చెప్పారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ.. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడంలో మాత్రం విఫలమైందన్నారు.

కేవలం 500 మంది అమర వీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు   ఉద్యమ కారులకు న్యాయం జరిగే వరకు కోట్లాడలేకపోయినందుకు తాను   క్షమాపణ చెబుతున్నాననీ అన్నారు.  అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే ప్రభుత్వంతో ఇప్పిస్తామని కవిత హామీ ఇచ్చారు. తాను 33 జిల్లాలు,119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనకు బయలుదేరు తున్నట్లు వెల్లడించారు. అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలన్నారు.

సబ్బండ వర్గాలూ కలిసి ఉంటేనే తెలంగాణ బాగుంటుందన్న ఆమె తన జాగృతి జనం బాటలో జిల్లాల్లో జరగాల్సిన అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడకు వెళ్లి పోరాటం చేస్తానన్నారు.  గతంలో జాగృతిలో పనిచేసిన వారికి స్వాగతం పలుకుతున్నానన్న ఆమె..  మనస్పర్థలు ఉంటే పక్కన పెట్టాలని కోరారు. సామాజిక తెలంగాణ కోసం కలిసిరావాలని  పిలుపునిచ్చారు.