నా ఇంట్లో నగదు దొరికితే చూపించాలి

 

ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ నివాసం దగ్గర ముగ్గురు వ్యక్తుల వద్ద రూ.17.50 లక్షల నగదు అధికారులు సీజ్ చేసారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తనపై వస్తున్న ఆరోపణలను జూపూడి ఖండించారు. కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని తన నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు చేశారని, అయితే ఎలాంటి నగదు లేదని వెళ్లిపోయారని తెలిపారు. కానీ ఇలాంటి గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారో తనకు అర్థం కావడంలేదన్నారు. తాము ఎక్కడ బతకాలో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బంధువులను కూడా తమ ఇంట్లోకి రానీయడంలేదని వాపోయారు. తన ఇంట్లో నగదు దొరికితే చూపించాలని, ఇంట్లో తన భార్య తప్ప ఎవరూ లేరని, ఇదంతా కావాలనే చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా చేయడం సరికాదని జూపూడి అన్నారు.