కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి కథ కంచికేనా?

posted on: Feb 3, 2026 2:18PM

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి భవిష్యత్తు క్లైమాక్స్‌కు చేరుకుందన్న ప్రచారం జరుగుతోంది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ల టికెట్ల విషయంలో తన వర్గానికి అన్యాయం జరిగిందని అక్కడి మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్రస్థాయ గళమెత్తడం ఆ ప్రచారానికి ఊతమిస్తోంది.  సీట్ల పంపకంలో.. తన గొంతు కోశారని, కాంగ్రెస్ అధిష్ఠానం తన వర్గానికి న్యాయం చేయలేదని జీవన్ రెడ్డి తన అనుచరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా.. 29 టికెట్లు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ వర్గానికి, 21 టికెట్లు జీవన్ రెడ్డి వర్గానికి పార్టీ అధిష్ఠానం కేటాయించినట్లు సమాచారం. ఈ అంశం జీవన్ రెడ్డి వర్గంలో మరింత అసంతృప్తిని పెంచినట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర కాలంగా సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన సంజయ్‌కు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంపై జీవన్ రెడ్డి గతంలోనే ఘాటుగా విమర్శించారు. ఇప్పుడు టికెట్ల అంశంతో ఆ విభేదాలు మరింత ముదిరినట్టు తెలుస్తోంది. మున్సిపాలిటీ టికెట్ల కేటాయింపులో జీవన్ రెడ్డి రియాక్షన్‌పై జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...