సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ బదిలీ
posted on May 31, 2013 5:13PM
సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. ఆయన జూన్ ఏడోతేదీన తన సొంత క్యాడర్ మహారాష్ట్ర సర్వీసుకు వెళ్లిపోతున్నారు. ఆయన ముంబయి క్రైం బ్రాంచ్ అధిపతిగా నియమితులయినట్లు తెలుస్్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ గనుల తవ్వకాలు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో జేడీ లక్ష్మీనారాయణ వెలుగులోకి వచ్చారు. ఆయన ధైర్యం, నిజాయితీ గల అధికారిగా పేరుపడ్డారు. ఈ రెండు కేసుల పరిశోధనలో ఆయనకు రాష్ట్రంలో ఏకంగా అభిమాన సంఘాలు తయారయ్యాయి. పలు చోట్ల జేడీ ఫోటోతో ఫ్లెక్సీలు కూడా పెట్టే పరిస్థితి వచ్చింది. అయితే ఈ క్రమంలో ఆయనను వివాదాస్పదుడిగా చేసే ప్రయత్నం జరిగింది. ఆయన కాల్ డేటా సేకరించడం, ఆయనకు ఇంకొకరితో సంబంధం అంటగట్టే ప్రయత్నాలు, ఆయన ఇతరులు చేస్తున్న వత్తిడి మేరకు దర్యాప్తు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కాల్ డేటా సేకరణ నేపథ్యంలో కేసుకూడా నమోదయింది. వీటన్నింటినీ ఆయన హుందాగా ఎదుర్కొన్నారనే చెప్పాలి. మొత్తానికి జేడీ లక్ష్మీనారాయణ బదిలీతో జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి.