జేసీ మీద చంద్రబాబు ఆగ్రహం

 

అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకరరెడ్డి మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం సింగవరంలోని పులివెందుల బ్రాంచి కెనాల్‌కి స్థానిక రైతులతో కలసి జేసీ దివాకరరెడ్డి గండి కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం మీద చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తనను కలవాలని జేసీని ఆదేశించారు. అన్ని ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని ప్రాజెక్టు కడుతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఎవరూ వ్యవహరించరాదని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. ఇదిలా వుండగా, జేసీ గండి కొట్టిన ప్రాంతానికి వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి తదితరులు పోలీసులు అరెస్టు చేశారు.