చంద్రబాబుపై జేసీ.. మీరు పొగడ్త అనుకుంటే నేనేం చేయలేను..

 

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కూడా తనకు తానే సాటి. ఒక్క జేసీ దివాకర్ రెడ్డి మాత్రమే కాదు.. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిది కూడా ఇదే ధోరణి. అయితే ఈసారి జేసీ దివాకర్ రెడ్డి విదాస్పద వ్యాఖ్యలు చేయలేదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి టీడీపీ చేరిన సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ పాలనలో నిమగ్నమైన చంద్రబాబు... తన మనవడితో కూడా సరదాగా గడపలేకపోతున్నారని.. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేసుకుపోతున్న చంద్రబాబు కర్మయోగిలా మారారని అన్నారు. అంతేకాదు మనవడు, మనవరాలితో గడిపే క్షణాలు ఏ వ్యక్తి జీవితంలోనైనా ప్రత్యేకమైనవేనని..  అసలు మీ మనవడితో ఎంతసేపు ఆడుకున్నారో చెప్పాలంటూ ఆయన చంద్రబాబును నిలదీశారు.

 

అయితే ఇంతా మాట్లాడిన జేసీ.. ఇది నా మనసులోని మాట.. దానిని మీరు పొగడ్త అనుకుంటే నేనేమీ చేయలేను అని ట్విస్ట్ ఇచ్చారు. అయితే జేసీ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలకు చంద్రబాబుకు ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా కూర్చున్నారు.