Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కమలనాథులకు ఆంటీ షాక్
posted on: Aug 17, 2022 11:20AM
సహజ నటి జయసుధ వెండి తెర మీద.. దాదాపు ఐదు దశాబ్దాల పాటు.. వివిధ పాత్రల్లో అభిమానులను అలరించింది. అయితే ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగా.. సైలెంట్గా ఉంటున్నారు. కానీ ఆమెను తమ పార్టీలో చేర్చుకోవాలని కమలనాథులు.. ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ క్రమంలో ఇప్పటికే బీజేపీ జాయినింగ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. ఈ సహజ నటితో భేటీ అయి.. పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
అయితే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలనే ఆలోచన అయితే ప్రస్తుతం తనకు లేదని ఈటలకు ఈ జ్యోతి సినిమా హీరోయిన్ క్లియర్ కట్గా స్పష్టం చేశారని సమాచారం. అలాగే అదే సమయంలో ఈటల ఎదుట జయసుధ పలు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. వాటిని అంగీకరిస్తే.. తాను పార్టీలో చేరేందుకు సిద్దమని ఈ సందర్భంగా ఈటలకు జయసుధ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే తన ముందు ఉంచిన ఈ ప్రతిపాదనలు.. హస్తినలోని పెద్దలతో మాట్లాడి.. చెబుతానని జయసుధతో ఈటల పేర్కొన్నట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ఝలక్ ఇచ్చి.. తెలంగాణలో పాగా వేసేందుకు మోదీ, అమిత్ షా ద్వయం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రముఖ సినీ రంగ ప్రముఖులు, మేధావులపై కమలనాథులు గురి పెట్టారు. వారిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా.. కమల దళాన్ని మరింత పటిష్ట పరిచేందుకు తెలంగాణ నేతలతో ఆ పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో వారితో రాష్ట్ర బీజేపీ నేతలు వరుస భేటీలు జరుపుతున్నారు. అలా జరిగిందే జయసుధతో భేటీ కూడా అనే ఓ చర్చ అయితే అటు రాజకీయ వర్గాల్లో .. ఇటు ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.
జయసుధ 2009లో నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో.. కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్కు గట్టి పోటీ ఇచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్కు సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం అడ్డా అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి తలసాని శ్రీనివాసయాదవ్ను జయసుధ ఓడించడంతో.. నాడు సహాజ నటి పేరు ఉమ్మడి రాష్ట్రంలో మారుమోగిపోయింది.
ఆమె ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆమె గుడ్ బై చెప్పారు. ఇక 2016లో విజయవాడలో చంద్రబాబు సమక్షంలో ఆమె భర్త నితీన్ కపూర్తో కలిసి టీడీపీ కండువా కప్పుకొన్ను. ఆ తర్వాత ఆమె సైకిల్ పార్టీకి కూడా బై బై గుడ్ బై చెప్పేసి.. మళ్లీ 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు లోటస్ పాండ్లో వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కొంత కాలంగా ఆమె స్తబ్దుగానే ఉంటున్నారు.
అలాంటి సమయంలో బీజేపీ నేతల దృష్టి.. జయసుధపై పడిందని సమాచారం. ఆమెను పార్టీలోకి తీసుకుంటే.. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలపై ఆమెకు నేటికి గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీకి తీసుకోవడం ద్వారా... టీఆర్ఎస్ స్పీడ్కు అడ్డుకట్ట వేయవచ్చుననే ఓ ఆలోచనలో బీజేపీ అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సహజ నటి ప్లస్ ఆంటీ సినిమా హీరోయిన్ జయసుధ.. అంటే ఈ ప్రపంచంలోని తెలుగువారందరికీ తెలుసన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో జయసుధను పార్టీలోకి తీసుకుంటే.. పార్టీకి మరింత అదనపు ఆకర్షణ ఏర్పడుతోందనే ఓ భావనలో మోదీ, అమిత్ షా ద్వయం సైతం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే.. తెలంగాణలో రాములమ్మ విజయశాంతి, తమిళనాడులో ఖుష్బు బీజేపీలో క్రియశీలకంగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో సహజ నటి జయసుధతో పాటు పలువురు సినీ ప్రముఖులను పార్టీలోకి తీసుకుంటే.. తెలంగాణలో కమలం పువ్వు వికసిస్తోందనే ఓ ఆలోచనలో కాషాయం దండు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే.. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని పలువురి కీలక నేతలు బీజేపీ గుటికి చేరుతున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి కమలం కండువా కప్పుకొనున్నారు. ఈ నెల 21న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మునుగోడులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు పార్టీలోని కీలక నేతలను.. కమలదళంలో చేర్చేందుకు సన్నాహాలు జెట్ స్పీడ్లో జోరందుకున్నట్లు సమాచారం.






