గతం తవ్వుకుని ఏం లాభం.. సామరస్యమే ఇప్పటి అవసరం.. జగ్గీ వాసుదేవ్
Published on: Mon May 23, 2022 1:48PM
దేశంలో సామరస్య భావన ఇప్పటి తక్షణావసరమని సద్గురు జగ్గీ వాసుదేవ్ కుండ బద్దలు కొట్టారు. దేశంలో సామరస్య వాతావరణానికి భంగం కలిగించే రీతిలో చెలరేగిపోతున్న సంఘ్ పరివార్ కు చెంప పెట్టులాంటి వ్యాఖ్యలు చేశారు. గతాన్ని తవ్వుకుని వివాదాల చిచ్చు రగల్చడం ఎంత మాత్రం సరైనది కాదని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు.
మసీదులన్నీ ఒకప్పటి దేవాలయాలే అంటూ వివాదాల చిచ్చును రేపడం వివేకం కాదని హితవు తెలిపారు. ఏప్పుడో దండయాత్రలలో కోల్పోయిన దేవాలయాల గురించి మాట్లాడటం సంస్కారం కాదన్నారు. నాడు కాపాడుకోలేకపోయిన వాటిపై ఇప్పుడు హక్కు కోసం దందా చేయడం తప్పని చెప్పారు. చరిత్రను తిరగరాయాలనుకోవడం ఏ విధంగా చూసిన సమర్ధనీయం కాదనీ, దీనిని ఎవరూ అంగీకరించరనీ, ఆమోదించరనీ స్పష్టం చేశారు.
ఇటువంటి విషయాలను కవర్ చేసే విషయంలో మీడియా సంయమనం పాటించాల్సి ఉంటుందని అభిప్రాయ పడ్డారు. సమస్య పరిష్కారం దిశగా అన్ని వర్గాలూ సంప్రదింపుల ప్రక్రియను పాటించాలన్నారు. జ్ణానవాపి మసీదు అంశాన్ని దృష్టిలో ఉంచుకునే జగ్గీ వాసుదేవ్ ఈ వ్యాఖ్యలు చేశారన్నది సుస్పష్టం.
మసీదులో శివలింగం కనిపించడంపై అసవసర వివాదం వద్దని ఆయన సంఘ్ పరివార్ శక్తులకు హితవు చెప్పారు. గతంలో దేవాలయమైనంత మాత్రాన అది ఇప్పుడు మసీదు కాకుండా పోదని జగ్గీ వాసుదేవ్ అన్నారు. దేశంలో ఇటువంటి వివాదాలు ముదరడం దేశ ప్రగతికి, క్షేమానికి ఇటువంటి వివాదాలు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని ఆయన హితవు చెప్పారు.


