Latest News

ఉన్న మాటంటే జగన్ టీమ్ కు ఉలుకెందుకు?.. వాస్తవాలు ఒప్పుకోవడానికి జంకెందుకు?

posted on: Apr 30, 2022 7:55AM

ఎపిలో కరెంట్‌, రోడ్లు,నీళ్ల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన వ్యాఖ్యలు వైసీపీ వెన్నులో చలిపుట్టించాయి. కాళ్ల కింద నేల కదిలిపోతోందా అన్నంతగా ఆ పార్టీ రియాక్ట్ అయ్యింది. కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి నానా అగచాట్లూ పడింది. పడుతోంది. అదే సమయంలో తెలుగుదేశం నేతలు కేటీఆర్ వ్యాఖ్యలు ఏపీ పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయనీ, ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి వైసీపీ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించాలని హితవు పలుకుతున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ స్పందిచిన తీరు ఉన్న మాటంటే ఉలుకెక్కువ అన్న నానుడికి సరిగ్గా అతికినట్లు సరిపోతుందని సెటైర్లు వేస్తున్నారు. మొత్తం మీద  కెటిఆర్‌ ఏపీలో పరిస్థితులపై చేసిన కామెంట్స్ తెరాస, వైసీపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి.   మాదాపూర్‌ హైటెక్సలో క్రెడాయ్
ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించిన  కేటీఆర్ అదే వేదికగా అభివృద్ధి విషయంలో ఏపీ అధ: పాతాళంలో ఉంటే.. తెలంగాణ ఆకాసమే హద్దుగా ఎదుగుతోందన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు.  మూడేళ్ల కిందటి వరకూ ఏపీ తెలంగాణలు అభివృద్ధిలో పోటీ పడితే.. ఆ తరువాత ఏపీ రేసులోంచి పూర్తిగా తప్పుకుందన్న వాస్తవాన్ని ఆయన తన వ్యాఖ్యల ద్వారా కళ్లకు కట్టారు. 

అంతే కాకుండా తెలంగాణ అప్పులు భవిష్యత్ తరాలపై పెట్టుబడి అని కూడా అన్నారు. ఆ మాటతో ఏపీలో అప్పులు ఆ రాష్ట్రంలో అభివృద్దికి ఇసుమంతైనా దోహదపడటం లేదని పరోక్షంగా ఎత్తి చూపారు.  ఇది జగన్ టీంకు పుండుమీద కారం చల్లినట్లుగా అయ్యింది. ఉన్న వాస్తవాన్ని అంగీకరించలేక.. కేటీఆర్ వ్యాఖ్యలు అసత్యాలని గట్టిగా చెప్పలేక.. సింగరేణి, బొగ్గు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఇక విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఆంధ్రా సంగతి మీ కెందుకు.. హైదరాబాద్ లోనే కరెంటు లేదు చూసుకోండంటూ ఎదురుదాడికి ప్రయత్నించి నవ్వుల పాలయ్యారు. హైదరాబాద్ లో మీ ఇంటికి కరెంటు బిల్లు కట్టారా? అంటూ తెలంగాణ మంత్రులు ప్రశ్నించే సరికి బొత్సకు నోట మాట రాని పరిస్థితి ఎదురైంది. అంతే కాదు.. హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా వాళ్లు సైతం బొత్స వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని తేల్చేశారు. సామాజిక మాధ్యమంలో ఆయనను ట్రోల్ చేశారు.  

ఆంధప్రదేశ్‌లో రోడ్లు, కరెంటు, నీళ్లపై   కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ వేడిని రగిల్చాయి. దాదాపు ఏపీ మంత్రులంతా కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పి కొట్టడానికే తమ శక్తియుక్తులన్నీ వినియోగించారు. జగన్ హయాంలో అభివృద్ధి పరుగులు తీస్తోందంటూ చెప్పుకోవడానికి నానా యాతనా పడ్డారు.  తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విజయవాడకు వచ్చి చూస్తే ఏపీ అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. ఏపీలో తాగు, సాగు నీటికి సమస్య లేదని నమ్మబలకడానికి ప్రయత్నించారు. పనిలో పనిగా తెలుగుదేశంపైనా విమర్శలు కురిపించేశారు.  అయితే విపక్ష తెలుగుదేశం గణాంకాలతో ససాక్ష్యంగా ఏపీలో విద్యుత్, రోడ్లు, నీళ్ల పరిస్థితిని వివరిస్తూ కేటీఆర్ మాటలు అక్షర సత్యాలని తేల్చేసింది. జగన్ అసమర్థత కారణంగానే పొరుగు రాష్ట్రం మంత్రి ఏపీపై ఇంత చులకనగా మాట్లాడే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని విమర్శించింది.  ఉన్న మాటంటే ఉలుకెందుకంటూ సామాజిక మాధ్యమంలో వైసీపీపై సెటైర్లు ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితిని అంగీకరించి.. వాటిని చక్కదిద్దేంతుకు ప్రయత్నిస్తే బాగుంటుందని రాజకీయ పరిశీలకులు సైతం ఏపీ సర్కార్ కు హితవు చెబుతున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...