లడ్డూ వివాదంలో జగన్ సెల్ఫ్ గోల్

posted on: Sep 30, 2024 9:56AM

జగన్ లడ్డూ వివాదంలో నిండా మునిగిపోయారు. ఆయనకు ఇక ఇందులోంచి బయటపడే దారులన్నీ మూసుకుపోయాయి. స్వతహాగా క్రైస్తవ మత విశ్వాసం ఉన్న జగన్ ను ఆ కారణంగా ఏపీలోని హిందూ ఓటర్లు ఎన్నడూ దూరం పెట్టలేదు. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ ఘన విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగలగడమే ఇందుకు నిదర్శనం. 2024 ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయానికి కూడా ఆయన మత విశ్వాసం ఎంత మాత్రం కారణం కాదు. అధికారంలో ఉన్న సమయంలో అరాచక పాలన సాగించడమే ప్రజలు ఆయనను తిరస్కరించడానికి కారణం. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకూ తావులేదు. అయితే ఇప్పుడు లడ్డూ వివాదంలో ఆయన హిందూ వ్యతిరేకిగా తనకు తానే ముద్ర వేసుకున్నారు. 

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వినియోగం ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను గాయపరిచింది. సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను వేసింది. ఆ సిట్ దర్యాప్తులో నిజానిజాలు తేలుతాయి. అయితే ఈ సమయంలో జగన్ ప్రాయశ్చిత పూజలు అంటూ తిరుమల ప్రయాణం పెట్టుకోవడం, అయితే తిరుమల వెంకన్న దేవుడిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించి తిరుమల ప్రయాణాన్ని రద్దు చేసుకోవడంతో ఆయన ప్రజలలో విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. 

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారం వెలుగులోకి రాగానే జగన్ తాను హిందూ వ్యతిరేకిని కాను అని చాటుకోవడానికి ఎన్ని చేయాలో అన్నీ చేశారు. అయితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కొనుగోలుకు రివర్స్ టెండరింగ్ ఎందుకు అవసరం అయ్యిందో వివరించడంలో మాత్రం విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రాయశ్చిత పూజలు అంటూ తిరుమల పర్యటన పెట్టుకోవడాన్ని తెలివితక్కువ వ్యూహంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆయన తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ అంశం తెరమీదకు వస్తుందని మెడమీద తలకాయ ఉన్న ఎవరైనా ఇట్టే చెప్పగలరు. అయితే జగన్ మాత్రం తన పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంటే వచ్చే పోలిటికల్ మెయిలేజ్ పై దృష్టి పెట్టారు తప్ప డిక్లరేషన్ అంశం బూమరాంగ్ అవుతుందని ఊహించలేదు. ఇప్పుడు అదే ఆయన మెడకు చుట్టుకుంది. జగన్ తిరుమల పర్యటనను ప్రభుత్వం అడ్డుకోలేదు సరికదా.. ఆయన పర్యటన సజావుగా సాగడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది. కూటమి పార్టీ శ్రేణులెవరూ జగన్ పర్యటనను అడ్డకోవద్దంటూ జనసేనాని పిలుపు కూడా ఇచ్చారు. 

అన్యమతస్థులు ఎవరైనా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే దేవుడిపై  విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంతో డిక్లరేష్ ఇవ్వడం ఇష్టం లేకే జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారని ధృవపడింది.  ఇప్పుడు ఇక డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా జనం నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం ద్వారా జగన్ స్వయంగా తాను హిందూ వ్యతిరేకిననీ, తిరుమల దేవుని పట్ల తనకు విశ్వాసం లేదనీ తనకు తానే చాటుకున్నట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...