Latest News

ఉత్తుత్తి సాయం.. ఊకదంపుడు ప్రసంగం.. జగన్ రూటే సెపరేటు!

posted on: Oct 25, 2024 12:48PM

పరామర్శలు, ఓదార్పులలో వైసీపీ అధినేత, మాజా ముఖ్యమంత్రి జగన్ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉంటారు. ఆయన ప్రతి పరామర్శ, ప్రతి ఓదార్పు రాజకీయ ప్రయోజనంతోనే ముడిపడి ఉంటుంది. అసలు జగన్ రాజకీయ ప్రస్ధానం ఇలాంటి పరామర్శలతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత  కాంగ్రస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ పార్టీని ఏర్పాటు చేసిన జగన్.. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి అంటూ ఓదార్పు యాత్ర చేపట్టారు. అది సుదీర్ఘంగా సాగింది. రోజులు, వారాలు, నెలలు కాదు ఏళ్ల తరబడి సాగింది. 

సాధారణంగా ఎవరయినా చనిపోతే వారి ఆత్మీయులు వెంటనే వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామ ర్శించి ఓదార్చి వస్తారు. కానీ మనిషి పోయిన ఏళ్ల తరువాత వెళ్లి పరామర్శ చేసి వస్తే ఏమనాలి. అసలు ఎవరు ఎవరిని పరామర్శిస్తున్నారన్న కన్ఫ్యూజన్ ఏర్పడేలా జగన్ ఓదార్పు యాత్ర సాగింది. ఎన్నికలలో మైలేజ్ కోసమే అన్నట్లుగా ఆయన అప్పట్లో చేపట్టిన ఓదార్పు యాత్రలు ఫలితాన్ని ఇవ్వలేదు. 2014 ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. అది వేరే సంగతి. ఇప్పుడు జగన్ మళ్లీ ఓదార్పు లేదా పరామర్శ యాత్రలు చేస్తున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం విపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. ఇప్పుడు అధికారం లేకపోవడంతో జగన్ మళ్లీ ఓదార్పు యాత్రలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఎక్కడ ఎవరు ఏ కారణంతో చనిపోయినా జగన్ వెంటనే అక్కడ వాలిపోతున్నారు. నెత్తిన చేతులు పెట్టి, అలింగనం చేసుకుని మృతుల కుటుంబీకులను ఓదారుస్తున్నారు. పనిలో పనిగా అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలూ గుప్పించేస్తున్నారు. 

అలాగే గతానికి భిన్నంగా తన ఓదార్పు సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన ప్రకటన అయితే చేస్తున్నారు కానీ.. ఆ సాయం తక్షణం అందించడం లేదు. సాధారణంగా ఎవరైనా ఓదార్పు, పరామర్శకు వచ్చిన సమయంలో బాధిత కుటుంబానికి చేయదలచుకున్న సాయం చేసి వస్తారు. అయితే జగన్ రూటే సెపరేటు.. ఆయన ఘనంగా ప్రకటన అయితే చేస్తారు.. అయితే ఆ ఆర్థిక సాయం ఎప్పుడు అందుతుంది అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. 

ఎనన్నికలలో పరాజయం తరువాత తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి ఎక్కువగా బెంగళూరులోనే మకాం ఉంటున్న జగన్ మోహన్ రెడ్డి ఏపీకి ఓదార్పుపర్యటనలకు మాత్రమే వస్తున్నారు.  ఇటీవల గుంటూరులో మరణించిన మహిళ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సందర్భంగా ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల మాటసాయం ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కు మాత్రం అందించలేదు. అలాగే అ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఏపీలో 77 మంది అత్యాచారానికి గురయ్యారనీ, వారందరికీ పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాననీ కూడా ప్రకటించేశారు. అయితే ఆ ఆర్థిక సాయం ఎప్పుడు ఎక్కడ ఎలా ఇస్తారో మాత్రం చెప్పలేదు.  విజయనగరం జిల్లాలో డయేరియా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల సాయం ప్రకటించేశారు. అంతకు ముందు విజయవాడ వరద బాధితుల కోసం కోటి రూపాయలు ప్రకటించారు. ఇలా ఆయన సాయం ప్రకటనలకే పరిమితమైంది కానీ బాధితులకు అందిన దాఖలాలు కనిపించడం లేదు.  నిజానికి ఇచ్చే ఉద్దేశం ఉంటే ప్రకటనతో పాటే సాయం కూడా అందజేయాలి. కానీ జగన్  ఎప్పుడూ అలా చేయలేదు.  ఆయన ఓదార్పు పరామర్శ అంతా ఉత్తుత్తి సాయం ప్రకటనలు.. ఊకదంపుడు ప్రసంగాలతోనే సరిపోతుంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...