జగన్ సింహం కాదు పిల్లి.. 2024 తరువాత వైకాపా మాయం.. చంద్రబాబు
posted on: May 9, 2022 4:02PM
సింహం సింగిల్ గా వస్తుందంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం అధినేత ఘాటుగా రిప్లై ఇచ్చారు. జగన్ సింహం కాదు పిల్లి అంటూ అభివర్ణించారు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సోమవారం వర్చువల్ గా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి జగన్ పైనా, వైసీసీపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ భయంతో వణికిపోతున్నారనీ, అందరి కాళ్లూ పట్టుకుంటున్నారని అన్నారు.
2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమన్న చంద్రబాబు.. ఓడిపోతే వైసీపీ అడ్రస్ ఉండదని జగన్ కు అర్ధమైందని అన్నారు. అందుకే జగన్ అక్రమ మార్గాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన భీమిలీ పర్యటనలో జనం జై బాబు నినాదాలు చేస్తే.. జై జగన్ నినాదాలు చేశారన్నట్లుగా వీడియోలు మార్ఫింగ్ చేసి సమాజిక మాధ్యమంలో పోస్టు చేశారని చంద్రబబు అన్నారు. అలాగే, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలని తాను అంటే.. పొత్తుల కోసం వెంపర్లాడుతున్నట్లుగా వక్రీకరించారని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రజల్లో జగన్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్ని వర్గాల ప్రజలు అసమర్థ ప్రభుత్వ పాలనతో విసిగిపోయి ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్న విషయం తన పర్యటనకు వచ్చిన స్పందన ద్వారా స్పష్టం అయ్యిందన్నారు. 2024లో టీడీపీకి అధికారం అనేది చారిత్రిక అవసరం అని ప్రజలే భావిస్తున్నారన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, జగన్ పోకడలను చూస్తే 2024 ఎన్నికలే వైసీపీకి చివరి ఎన్నికలు అవనున్నాయని అన్నారు.
బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. గ్రామ స్థాయిలో పార్టీలో చేరికలను ఆహ్వానించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.






