జగనన్న బోనులో ఉన్న పులి: షర్మిల

 

ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర విజయవాడ ప్రకాశం బ్యారేజి మీదుగా కృష్ణ జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా స్థానిక కాళోజి మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ పులి బోనులో ఉన్నప్పటికీ అది పులే అని తన సోదరుడిని బోనులో ఉన్న పులితో ఆమె పోల్చారు. ఆయన బయట ఉంటే తెదేపా, కాంగ్రెస్ పార్టీల ఆటలు సాగవు గనుక, ఆ రెండు పార్టీలు కుమ్మకయి జగన్ మోహన్ రెడ్డి ని అన్యాయంగా జైలులో ఇరికించాయని ఆమె అన్నారు. ఈ ప్రభుత్వానికి బొత్తిగా మానవత్వం అనేది కరువయిపోయిందని ఆమె విమర్శించారు.

 

పాదయాత్రలు చేస్తూ ప్రజల మద్య తిరుగుతున్న చంద్రబాబు ప్రజల కష్టాలు స్వయంగా చూస్తున్నపటికీ, వారిని కష్టాలు పాలు చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికే అండగా నిలబడి ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆమె అన్నారు. త్వరలోనే జగనన్న విడుదలయి రాజన్న రాజ్యం తెస్తాడని ఆమె ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు.

 

ఆమె తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డిని బోనులో ఉన్న పులితో పోల్చడం కాంగ్రెస్, తెరెసా, తెదేపాలకు మరో కొత్త అస్త్రం అందించినట్లయింది. జగన్ మోహన్ రెడ్డి వంటి పులిని బోనులో ఉంచక బయటకి వదిలితే అది మరింత రెచ్చిపోయి అందరినీ తినేస్తుందని, అందువలన దానిని బోనులోనే ఉంచడమే మేలని రేపటి నుండి తెదేపా, కాంగ్రెస్ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆట పట్టించే అవకాశం ఉంది.