జగన్ అప్పుడే మొదలెట్టేశారు!.. ఫ్యాన్ స్పీడ్ తగ్గిందనా?
Published on: Mon Apr 25, 2022 7:23AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యూహరచన, కార్యాచరణ అప్పుడే మొదలెట్టేశారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలు ఇంకా రెడీ కాకపోయినా ఆయన తనపని ఆరంభించేశారు. ఇటీవలి వరుస సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో ఫ్యాన్ గాలి స్పీడ్ తగ్గిందన్న అభిప్రాయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఇప్పటి నుంచే పని ప్రారంభించేయాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికలలో తన విజయానికి తాను నిత్యం ప్రజల మధ్యలో తిరగడమే కారణమని నమ్ముతున్న ఇఫ్పుడు మరో సారి అదే చేయాలని వ్యూహ రచన చేస్తున్నట్లు అభిజ్ణ వర్గాల భోగట్టా. అయితే విపక్ష నేతగా నిత్యం ప్రజల మధ్యలో ఉండటానికీ, ముఖ్యమంత్రి హోదాలో పర్యటనలు చేయడానికి చాలా తేడా ఉందన్న విషయం ఆయన గ్రహింపునకు రాలేదని అంటున్నారు. ఇప్పుడు జగన్ ప్రజాక్షేత్రంలోకి వెళితే మూడేళ్ల పాలనా వైఫల్యాలపై సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. అది చేయకుండా విపక్షాలపై విమర్శల దాడులు చేయడం వల్ల ప్రయోజనం చేకూరదు.
ఇంతకీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు జగన్ రచిస్తున్న వ్యూహాలేమిటంటే...ఈ మూడేళ్ల వైఫల్యాలూ పాత మంత్రుల ఖాతాలో వేసి తాను పులు కడిగిన ముత్యమన్నట్లుగా జనంలోకి వెళ్లాలన్నదేనని విశ్లేషకుల అభిప్రాయం. అందుకే అసంతృప్తులకూ, అసమ్మతీయులకూ వెరవకుండా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేశారన్నది వారి విశ్లేషణ.
ఇక ఇప్పుడు తన జిల్లాల పర్యటనలకు ముందు పార్టీ కమిటీలతో, కార్యకర్తలతో, రిజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, జిల్లా అద్యక్షులు..ఇలా ఒకరనేమిటి అందరితో సమావేశం ఏర్పాటు చేసి...ఆ సమావేశంలో తన జిల్లాల పర్యటన సందర్భంగా అనుసరించాల్సిన విధానంపై వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. విపక్షాలపై విమర్శలతో పాటు....ఈ మూడేళ్ల పాలనలో ఏవైనా వైఫల్యాలుంటే...అవి ఉద్వాసనకు గురైన మంత్రుల ఖాతాలో వేసేలా ఈ భేటీలో ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు కొత్త టీమ్ తో సరికొత్తగా వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలన్నది ఆయన వ్యూహంగా చెబుతున్నారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి ఆరంభం కానున్న గడపగడపకూ వైసీపీలో కూడా ఇదే అగ్రపీఠిన నిలవాలన్నది ఆయన ఉద్దేశం.
ఇక పీకే, కాంగ్రెస్ ములాఖత్ నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ వైఖరిపై పార్టీ శ్రేణులు ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆ విషయంలో వారికి క్లారిటీ ఇచ్చేందుకు కూడా ఈ సమావేశంలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏది ఏమైనా ఎన్నికలు రెండేళ్ల ముందుగానే జగన్ పార్టీలో, పార్టీ శ్రేణుల్లో ఎన్నికల వేడి రగిలించే ప్రయత్నం చేయడం వెనుక తన ప్రభుత్వంపై ప్రజలలో అంగా సానుకూలత కనిపించడం లేదన్న నివేదికలే కారణమని అంటున్నారు. పీకే సర్వేలు కూడా ఇదే చెప్పడంతో ఆయన ఇప్పటి నుంచే పని మొదలెట్టేశారన్నది పరిశీలకుల విశ్లేషణ.


