ఆ ముగ్గురు కలిస్తే జగన్ అవుట్ .. అందుకే వైసీపీలో వణుకు

posted on: May 21, 2022 11:06AM

ఆంధ్ర ప్రదేశ్’లో మళ్ళీ మరో మారు, ఆ మూడు పార్టీలు ఒకటవుతాయా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ, జనసేన కూటమి మళ్ళీ తెలుగు దేశం పార్టీతో పొత్తుకు సిద్డంవుతోందా, అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవుననే అంటున్నారు.

వ్యతిరేక ఓట్లు చీలకుండా చుస్తానని ఎప్పుడోనే మాటిచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో అడుగు ముందు కేశారు. తెలుగు దేశంతో పొత్తుకు బీజేపీని ఒప్పించే బాధ్యతను ఆయన తీసుకున్నారు. జనసేన రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాజధాని విషయంలో బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించిన విధంగానే పొత్తుల విషయంలోనూ బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఒప్పించగలనన్న విశ్వాసం వ్యక్త పరిచారు. రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా, మూడు పార్టీలు కలిసి, కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా ముందుకు వెళ్ళాలని అన్నారు. మంచి ఆలోచన. ప్రస్తుత పరిస్థితులలోఅవసరమైన ఆలోచన.  

అయితే, బీజేపీ కేంద్ర నాయకత్వం విషయం ఎలా ఉన్నా, బీజేపీలో జగన్ రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి  కొమ్ముకాస్తున్న వర్గం ఇందుకు అంగీకరిస్తుందా అన్నదే ఇప్పుడు అందరి ముందున్నప్రశ్న. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్ ధియోధర్ వంటివారు టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే అనేక సందర్భాలలో స్పష్టం చేశారు. బీజేపీ, జనసేన కూటమిలో మూడో పార్టీకి స్థానం లేదని అంటున్నారు. మరో వంక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందుకు విరుద్ధంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడవలసిన, ‘చారిత్రక’ అవసరాన్ని నొక్కి చెపుతున్నారు.

ఈ నేపద్యంలో కొంత కన్ఫ్యూజన్,గందరగోళం ఉన్నా, పవన్ కళ్యాణ్ తాజా ప్రకటనతో, బీజేపీ సంగతి ఎలా ఉన్నా, తెలుగు దేశం, జనసేన పొత్తు ఖరారు అయినట్లుగానే భావించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.  నిజానికి, ఏపీలో బీజేపీకి ఉన్న బలం ఆవగింజలో అరవయ్యో వంతు కూడా ఉండదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక శాతం కంటే తక్కువ (0.84) ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

అంతకు ముందు 2014లో టీడీపీ, జనసేన పొత్తులో పోటీ చేసి నాలుగు (4) అసెంబ్లీ, ఒక (1) లోక్ సభ స్థానం గెలుచుకున్న కమల దళానికి 2019లో ఒక్క సీటు కూడా రాలేదు. అసలు ఖాతానే తెరవలేదు. నిజానికి, జాతీయ స్థాయిలో ఉన్న బలమే ఏపీలో బీజేపీ ఉనిని కాపాడుతోందంటే, అందులో ఆక్షేపించవలసిన, అభ్యంతరం చెప్పవలసిన అంశం ఏదీ లేదు.    అయితే జాతీయ స్థాయిలో బీజేపీకి తిరుగులేదు. కను చూపు మేరలో ఎక్కడా బీజేపీకి మరో ప్రత్యాన్మాయం పార్టీ,కూటమి ఏదీ కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర పుటల్లో చేరిపోయిన నేపధ్యంలో మరో ప్రత్యాన్మాయ పార్టీ, కూటమి ఏర్పడే అవాకాశాలు సైతం అంతగా కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే, ఏపీ రాజకీయాలలో బీజేపీ పోషించేది, పోషించగలిగేది, ఆటలో అరటి పండు పాత్ర మాత్రమే. అందులో ఎవరికీ సందేహం లేదు.

అయితే, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పవన్ కళ్యాణ్ బీజేపీతో తెగతెంపులు చేస్కునేందుకు సిద్ధంగా లేరని అయన మాటలను బట్టి అర్థమవుతోంది. అలాగే ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం అండదండలు అవసరమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అంతే కాకుండా, జనసేన, బీజేపీల మధ్య చాలా కాలంగా పొత్తున్నా. రెండు పార్టీల మధ్య సయోధ్యత మాత్రం ఇంకా మొగ్గ తొడగలేదు. గడచిన రెండు మూడేళ్ళలో రెండు పార్టీల చేసిన ఉమ్మడి ఉద్యమం ఒక్కటి కూడా లేదు. ఉభయ పార్టీల నాయకులు కలిసి కూర్చున్న  సందర్భాలు ఆల్మోస్ట్ నిల్’.. సున్నా. ఎవరి దారిన వారు పోతున్నారు.. పవన్ కళ్యాణ్ నేరుగా బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడతారే కానీ, రాష్ట్ర నాయకులను మర్యాదపూర్వకంగా అయిన పలకరించరు. బీజీపే పెద్దన్న పాత్రను అసలే అంగీకరించరని, బీజేపీ నాయకులు  ఉడికి పోతున్నారని అంటారు. ఏమైనా, బీజేపే నిర్ణయం ఏదైనా, ఏపీలో తెలుగు దేశం , జనసేన పొత్తు ఖరారైనట్లేనని, తెలుస్తోంది. అందుకే అధికార  వైసీపీలో వణుకు మొదలైంది. పవన్ కళ్యాణ్ అన్నట్లుగా, ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం’ అన్న నాలుగు పదాలు వైసీపీ నాయకులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...