జగన్ ఢిల్లీకి అలా వెళ్లారు.. ఇలా వచ్చారు!

posted on: Aug 23, 2022 6:49AM

జగన్ హస్తిన పర్యటన అదేదో రియాల్టీ షోలో హోస్ట్ చెప్పినట్లు అలా వెళ్లి, ఇలా వచ్చేసినట్లు ముగిసిపోయింది. మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆఖరికి వైసీపీలో కూడా జగన్ పర్యటన గురించి పెద్దగా చర్చ లేదు. ప్రధాని నివాసంలో జగన్ గడిపింది ఓ అరగంట. అందులో జగన్- మోడీ మధ్య భేటీ ఎంత సేపు జరిగిందన్నదానిపై క్లారిటీ లేదు.

అయితే సీఎంవో ప్రెస్ నోట్ ప్రకారం పోలవరం సహా పలు డిమాండ్లతో జగన్ ప్రధానికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆ తరువాత లాంఛనంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. మధ్యలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి మాత్రమే ఉన్నారు. జగన్ అమిత్ షాతో కూడా భేటీ కానున్నారని వైసీపీ శ్రేణులు చెప్పారు. అయితే అమిత్ షా అప్పాయింట్ మెంట్ జగన్ కు లభించలేదని హస్తిన వర్గాల ద్వారా తెలిసింది.  జగన్ మోడీతో చర్చించిన విషయాలేమిటన్నది పక్కన పెడితే ఆయన పోలవరంపై ప్రధానికి వినతి పత్రం ఇచ్చారని మాత్రం సీఎంవో ఒక నోట్ విడుదల చేసింది.

గతంలో పలు మార్లు మోడీతో జగన్ భేటీ అయ్యారు. అలా భేటీ అయిన ప్రతి సారీ... వారిరువురి మధ్యా జరిగిన చర్చ ఏమిటన్నది ఎవరికీ తెలియని రహస్యంగానే మిగిలిపోయింది. ఇప్పుడూ అంతే సీఎంవో నుంచి విడుదలైన ప్రకటన వినా.. జగన్ మీడియా సమావేశం పెట్టి ఏం మాట్లాడారో వివరించిన సందర్భం లేదు. ఇప్పుడూ అదే జరిగింది. ఇంత హఠాత్తుగా.. సిరికిం జెప్పడు అన్న చందంగా జగన్ హస్తిన ఎందుకు వెళ్లారు? ఎందుకు వచ్చారు? అంటే వైసీపీ సీనియర్లు కూడా చెప్పలేని పరిస్థితి. అయితే పరిశీలకులు మాత్రం కేవలం రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టుకురావడానికే జగన్ హస్తిన పర్యటన అంటున్నారు.

రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాల సంకేతాల నేపథ్యంలోనే జగన్ హస్తినకు హుటాహుటిన బయలుదేరి వెళ్లారని చెబుతున్నారు. ఇటీవల అంటే అజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీ సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో మోడీ కొద్ది నిముషాలసేపైనా ఆప్యాయంగా ముచ్చటించడం.. మరో సారి కలుద్దాం అంటూ ఆహ్వానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ హడావుడిగా హస్తిన వెళ్లారని చెబుతున్నారు. అలాగే ఢిల్లీ మద్యం స్కాం బయటపడిన నేపథ్యంలో.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఏపీ లింకులు ప్రస్తావించడం కూడా జగన్ హస్తిన పర్యటనకు కారణమని అంటున్నారు.మొత్తం మీద జగన్ హస్తిన పర్యటన ఎవరికీ పట్టకుండా పోయింది.

మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఆఖరికి సొంత పార్టీ వారు కానీ జగన్ హస్తిన పర్యటనను పెద్దగా పట్టించుకోలేదు. ఆయన హస్తిన వెళ్లడం, రావడం మామూలేగా అన్నట్లు నిర్లింప్తంగా ఉండిపోయారు. రాజకీయంగా లేదా కేసుల పరంగా ఏదైనా కొద్ది పాటి ఒత్తిడి వస్తే జగన్ హస్తిన వెళ్లి వస్తారని పార్టీ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ సారి అదే జరిగిందని వారు అంటున్నారు.
  జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాల్సిందే. మొత్తంగా జగన్ ఢిల్లీ పర్యటన ఎప్పటిలా ఎవరికీ ఆసక్తి కలిగించలేదు. చివరికి వైసీపీ నేతలు కూడా. ఎందుకంటే.. జగన్ వెళ్తారు.. వస్తారు.. చివరికి లోపల ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ ఒకటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అందుకే ఎవరూ పట్టించుకోవడం లేదు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...