Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ధర్మాన బ్రదర్స్ కు జగన్ చెక్స్.. దువ్వాడను దువ్వుతున్నది అందుకేనా?
posted on: Feb 11, 2026 4:06PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున వైసీపీ ఎమ్మెల్యేలు 11 మందీ (జగన్ సహా) అసెంబ్లీకి హాజరై 11 నిముషాలు సభలో ఉండి వాకౌట్ చేయడం తెలిసిందే. వాకౌట్ తరువాత సభ బయటకు వచ్చిన జగన్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులుతో ఒకింత ప్రత్యేకంగా మాట్లాడారు. దగ్గరకు పిలిచి.. మరీ ఆయనతో కొద్ది సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా దువ్వాడను ఒక సారి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి కలవమని కూడా ఆదేశించారు.
రాజకీయవర్గాలనే కాకుండా ఈ సంఘటన వైసీపీయులను కూడా విస్మయ పరిచింది. ఎందుకంటే దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడానికి బయటకు ఎన్ని కబుర్లు చెప్పినా వాస్తవం మాత్రం ఆయనకు ధర్మాన ప్రసాదరావుతో ఉన్న విభేదాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ శ్రేణులు కూడా అదే కారణం చెబుతున్నారు.
అది పక్కన పెడితే జగన్ దువ్వాడతో ఇక నుంచీ పార్టీ గొంతు బలంగా వినిపించాలని చెప్పినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా ఇక్కడే ఇక దువ్వాడ సస్పెన్షన్ ను ఎత్తివేయడం ఖాయమన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దువ్వాడలా నోరు గట్టిగా పారేసుకోగల వ్యక్తులు పార్టీకి చాలా అవసరమని జగన్ భావిస్తున్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత కూడా ఇప్పటి వరకూ జగన్ కు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడని దువ్వాడపై సస్పెన్షన్ ఎత్తివేసి కీలక బాధ్యత అప్పగించాలని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సస్పెన్షన్ లో ఉండి కూడా దువ్వాడ లడ్డూ వివాదంపై అధికార కూటమి నేతలపై గట్టిగానే నోరు పారేసుకున్నారని అంటున్నారు.
ఇది పక్కన పెడితే జగన్ దువ్వాడను దువ్వి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి కలవమనడం చూస్తుంటే.. జగన్ పార్టీలో సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ లకు చెక్ పెట్టే ఉద్దేశంలో ఉన్నారా అన్న అనుమానాలు వైసీపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతున్నాయి. ధర్మాన బ్రదర్స్ జిల్లాకే చెందిన దువ్వాడను ప్రోత్సహించడం ద్వారా వారికి చెక్ పెట్టాలని, పార్టీలో వారి ప్రాధాన్యత తగ్గించాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. చూడాలి మరి దువ్వాడ ఎంట్రీ ధర్మాన సోదరులపై పార్టీలో ఏ మేరకు ప్రభావం చూపుతుందో?






