ఇరాన్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి

posted on: Mar 4, 2026 10:09AM

ఇరాన్‌పై ఇజ్రాయెల్ వ్యూహాత్మకం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ నగరం కోమ్‌లోని ఇరాన్ సుప్రీం నేతను ఎన్నుకునే  కౌన్సిల్ ఆఫ్ ఎక్స్‌పర్స్ట్ భవనంపై ఇజ్రాయెల్ మంగళవారం( మార్చి 3) వైమానిక దాడులు జరిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ అధికారులు ధృవీకరించారు.

 ఇరాన్ సుప్రీం నేతను ఎన్నుకునే బాధ్యత కౌన్సిల్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ పైనే ఉంటుంది. శనివారం (ఫిబ్రవరి 28)  నాటి దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆయన వారసుడి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఖమేనీ వారసుడిని ఎన్నుకునేందుకు ఓటింగ్ జరిపి, వాటిని లెక్కిస్తుండగా ఇజ్రాయెల్ దాడి జరిపినట్టు చెబుతున్నారు. అయితే ఆ సమయంలో కౌన్సిల్‌లోని 88 మంది సభ్యులలో ఎంతమంది హాజరయ్యారు, ఏమేరకు నష్టం జరిగిందనేది వెంటనే తెలియరాలేదు. కొత్త సుప్రీం నేతను ఎన్నుకోకుండా నిరోధించడానికే తాజా దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సమాచారం ప్రకారం, టెహ్రాన్‌లోని కీలక ప్రభుత్వ భవంతులపై ఇజ్రాయెల్ వాయుసేన తాజాగా బాంబు దాడులు జరిపింది. వాటిలో ఇరాన్ అధ్యక్ష భవనం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నాయి. మరోవైపు..  ఖమేనీ తదితర కీలక నేతల మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్, మధ్యప్రాచ్యంలోని యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. మంగళవారం (మార్చి 3) ఇరాన్ డ్రోన్ ఒకటి రియాద్‌లోని అమెరికా ఎంబసీని ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. అయితే నష్టం తక్కువగానే జరిగినట్టు సౌదీ అధికారులు తెలిపారు. కువైట్‌లోని యూఎస్ కార్యాలయంపై కూడా డ్రోన్ దాడి జరగడంతో ఆ కార్యలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...