బాల్యంలోనే ప్రతిభని గుర్తించి ప్రోత్సహించాలి: సచిన్

 

పిల్లలలోని క్రీడా ప్రతిభను వారి చిన్నతనంలోనే గుర్తించి ప్రోత్సహించాలని సచిన్ టెండూల్కర్ అన్నారు. అయితే భారతదేశంలో అలాంటి వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐ ఎస్‌ఎల్‌) ఫ్రాంచైజీ కేరళ బ్లాస్టర్స్‌కు సహ యజమాని అయిన సచిన్‌ టెండూల్కర్ ఆ జట్టు జెర్సీలను విడుదల చేయడానికి సోమవారం కోచి వచ్చాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ ‘‘చాలా దేశాలలో క్రీడాకారులను చిన్నవయస్సులోనే గుర్తించి, వారికి తగిన శిక్షణ ఇస్తారు. కానీ మన దేశంలో వారు యుక్తవయస్సుకు వచ్చాకే ఈ ప్రక్రియ మొదలవుతుంది. దాంతో వారు ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు వీలుండడంలేద’’ని తెలిపాడు. తాము స్థానిక ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తామని సచిన్ టెండూల్కర్ చెప్పాడు.