ప్రారంభమైన బుద్ధిస్ట్ సర్క్యూట్ పర్యాటక రైలు...

 

ప్రపంచానికి శాంతిని బోధించిన గౌతమ బుద్ధునికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను సందర్శించుకొనాలనే పర్యాటకుల కోసం భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో నడిచే రైలు ఈరోజు ప్రారంభమైంది. బుద్ధిస్ట్ సర్క్యూట్ పర్యాటక రైలు పేరుతో ఐ.ఆర్.సీ.టీ.సీ నడిపే ఈ ప్రత్యేక రైలు ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఎనిమిది రోజుల పాటు బుద్ధుడు నడయాడిన పలు ప్రదేశాలు సహా వివిధ ప్రసిద్ధ ప్రాంతాలను వీక్షించేలా పర్యాటకుల కోసం ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్, నేపాల్ లోని గౌతమ బుద్ధునికి సంబంధించిన పర్యాటక ప్రాంతాల కోసం భారతీయ రైల్వే నడిపే ప్రత్యేక బుద్ధిస్ట్ సర్క్యూట్ పర్యాటక రైలు ఢిల్లీ లోని సఫ్దర్ జంగ్ స్టేషన్ నుంచి ఈరోజు ప్రారంభమైంది.

నేపాల్ లోని బుద్ధుడి జన్మస్థలం లుంబిని సహా భారత్ లోని బుద్ధుడికి జ్ఞానోదయమైన బోధ్ గయ తొలిసారి ధర్మోపదేశం చేసిన సారానాథ్ నిర్యాణం చెందిన కుషీనగర్ వంటి పలు సందర్శనీయ బౌద్ధ క్షేత్రాలను సందర్శించేలా ఈ రైలు పర్యాటక ప్యాకేజీని రూపొందించారు. ఎనిమిది రోజులు ఏడు రాత్రుల పాటు ఉండే ఈ ఆధ్యాత్మిక వైజ్ఞానిక యాత్రలో పర్యాటకులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రైలు ఢిల్లీ నుంచి బయలుదేరి తొలుత బీహార్ లోని గయ, రాజగిరి, నలందా అక్కడి నుంచి వారణాసి, సారనాథ్ చేరుకుంటుంది. తర్వాత నేపాల్ లోని లుంబినీ అక్కడి నుంచి కుషినగర్ శ్రావస్తి మీదుగా ఎనిమిదవ రోజు ఆగ్రా కు చేరుకోనుంది. ఎనిమిది కోచ్ లతో కూడిన ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలులో ఫస్టుక్లాసు లో తొంభై ఆరు, సెకండ్ క్లాస్ లో అరవై ఏసీ బెర్తులు అందుబాటులో ఉంటాయి.

రెండు కోచ్ లలో పూర్తిగా రెస్టారెంట్, డైనింగ్ హాల్ ఉండగా మరో కోచ్ లో వంటగది ఉంది. తేజస్ రైలులో ఉన్న విధంగా పూర్తి సౌకర్యాలతో బెర్తులు ఉన్నాయి, విలాసవంతమైన హోటళ్లను తలపించేలా కంపార్టుమెంట్ లు ఉంటాయి. ఎనిమిది రోజుల యాత్రకు ఒక్కొక్కరికీ ఫస్ట్ క్లాస్ లో లక్షా ఇరవై మూడు వేల రూపాయలు, సెకండ్ క్లాస్ లో లక్ష రూపాయల వరకు చార్జీలుగా వసూలు చేస్తారు. బౌద్ధ మతానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాల సందర్శన కోసం ఎక్కువగా తూర్పు, దక్షిణ, ఈశాన్య, ఆసియా దేశాల నుంచి పర్యాటకులు వస్తారని అధికారులు తెలిపారు.

రైలులో ఉన్న రెస్టారెంట్ లో పర్యాటకుల అభిరుచిని బట్టి వంటకాలను వడ్డిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇండియన్, చైనీస్, థాయ్ సహా పలు రకాల వంటకాలను సిద్ధం చేస్తామని వెల్లడించారు. వంటగదిలో మంటలు రాకుండా కేవలం ఐరన్ ప్లేట్ లను వేడి చేయడం ద్వారా అత్యాధునికంగా వంట చేసే విధానాన్ని అవలంబిస్తున్నారు. బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలును ఏడాదికి పన్నెండు ట్రిప్పులను నడపాలని ఐ.ఆర్.సీ.టీ.సీ భావిస్తోంది. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ఏడు నెలల్లో ఈ రైలును నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి కోచ్ కు ఓ భద్రతా సిబ్బంది ఉంటారు, యాత్రలో కాలక్షేపం కోసం బుద్ధుని జీవిత విశేషాలతో కూడిన ఓ చిన్న గ్రంథాలయం, పాదాలకు మసాజర్ వంటి సౌకర్యాలను సైతం అందుబాటులో ఉంచారు.