రైజింగ్ ... రైజింగ్ ... సన్ రైజింగ్ ....
posted on Apr 6, 2013 7:36AM
ఐపిఎల్-6 ముచ్చటగా మూడో మ్యాచ్ సన్ రైజర్స్ x పూణే వారియర్స్ మధ్య హైదరాదాబ్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో జరిగింది. గత సీజన్ లో హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ పేరుతొ ఆడిన టీం ఎనిమిదవ స్థానంలో నిలిచింది. సన్ రైజర్స్ పేరు మార్పుతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ శుభారంభం చేశారు. పూణే వారియర్స్ టాస్ గెలిచి సన్ రైజర్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లు పార్థివ్ పటేల్, అక్షిత్ రెడ్డి సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. పార్థివ్ పటేల్ దూకుడుగా ఆడుతున్న సమయంలో అశోక్ దిండా వేసిన చక్కటి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పార్థివ్ పటేల్ 19 పరుగులు చేసి అవుటయ్యాడు. అక్కడినుండి ఆట మందకొడిగా సాగింది. కెప్టెన్ సంగక్కర వికెట్ కాపాడుకునే క్రమంలో నింపాదిగా ఆడుతూ వచ్చాడు. నిలదొక్కుకుంటాదనుకున్న సంగక్కరను(15) రాహుల్ శర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓపెనర్ అక్షిత్ రెడ్డి(27) యువరాజ్ సింగ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో పెరీరా దూకుడుగా ఆడి 30 పరుగులు చేసిన తరువాత దిండా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సన్ రైజర్స్ ఇన్నింగ్ లో మిగతా బ్యాట్స్ మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెమరూన్ వైట్ 10, విహారి11, ఆశిష్ రెడ్డి 7 నాటౌట్, రవితేజ 4 నాటౌట్ గా నిలిచారు. సన్ రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. తక్కువ స్కోరు చేదించవలసిన పూణే వారియర్స్ 18.5 ఓవర్లలోనే 104 పరుగులు చేసి కుప్పకూలింది. ఒకే ఓవర్లో 6 x 6 కొట్టిన యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. అతను కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రెండో ఇన్నింగ్స్ ను రాబిన్ ఊతప్ప, మనీష్ పాండే లు ప్రారంభించారు. ఊతప్ప దూకుడుగా ఆడుతుండటంతో పూణే వారియర్స్ విజయం తథ్యమని అందరూ భావించారు. కానీ సన్ రైజర్స్ చక్కటి లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేశారు. మిశ్రా 3 వికెట్లు, స్టెయిన్ 3 వికెట్లు, పెరీరా 2 వికెట్లు పడగొట్టారు. పూణే వారియర్స్ ఇన్నింగ్స్ లో ఊతప్ప 24పరుగులు, మనీష్ పాండే 15 పరుగులు, శామ్యూల్స్ 5 పరుగులు, యువరాజ్ సింగ్ 2 పరుగులు, రాస్ టైలర్ 19 పరుగులు, నాయర్ 19 పరుగులు, మాథ్యూస్ 8 పరుగులతో నాటౌట్, మిచెల్ మార్ష్ 7 పరుగులు, భువనేశ్వర్ 3పరుగులు, రాహుల్ 0 పరుగులు, దిండా 0 పరుగులు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అమిత్ మిశ్రా నిలిచాడు.