కోటీశ్వరుడిగా మారిన కూలీ కొడుకు
posted on Feb 7, 2016 5:01PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక విచిత్రమైన టోర్నీ. ఇక్కడ ఏ ప్లేయర్ ఎందుకు రేట్ పలుకుతారో, ఏ ఫ్రాంఛైజీ ఎవర్ని ఎందుకు కొనుగోలు చేస్తుందో తెలియదు.తాజాగా జరిగిన ఐపిఎల్ వేలంలో, ఒక అనామక క్రికెటర్ కోటీశ్వరుడుగా మారాడు. జైపూర్లో ఒక వైర్ల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసే భరత్ సింగ్ కొడుకు నాథూసింగ్. కేవలం 11 టి-ట్వంటీలు మాత్రమే ఆడిన నాథూ ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ నోట నానుతున్నాడు. వేలంలో 3.2 కోట్లు పెట్టి మరీ, ముంబై అతన్ని దక్కించుకోవడం విశేషం..
నాథూకి ఉన్న ప్రత్యేకత అతని వేగం. ఇప్పుడు భారత్ ఉన్న యువ బౌలర్లలో, నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బంతులేసే వారిలో నాథూ కూడా ఒకడు. ఒకానొక సమయంలో, ఇక క్రికెట్ వదిలేసి, తాను కూడా ఫ్యాక్టరీలో చేరిపోదామనుకున్న నాథూ జాతకాన్ని ఐపిఎల్ వేలం మార్చేసింది. టాలెంట్ ఉన్న వారి జీవితంలో ఐపిఎల్ ఒక ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తోంది. నేడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న ఎంతో మంది ప్లేయర్లు, ఐపిఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన వారే. ప్రతీ సీజన్లోనూ స్టార్ ప్లేయర్లు మాత్రమే వేలంలో సంచలనాలు నమోదు చేస్తుండగా, ఈ సారి మాత్రం దేశవాళీ ఆటగాళ్ల పంట పండింది. నాథూరాంతో పాటు పవన్ నేగి, దీపక్ హుడా, ఎమ్.అశ్విన్, రిషభ్ పంత్,కరుణ్ నాయర్, అంకిత్ రాజ్ పుత్, ఆదిత్య తారే లాంటి దేశవాళీ ప్లేయర్లందరూ కోటీశ్వరులుగా మారిపోయారు. మరి వీరిలో ఎంతమంది తమకు పలికిన రేటుకు న్యాయం చేస్తారో చూడాలి.