తాడేప‌ల్లి ప్యాలెస్‌లో అస‌లు సీన్‌ వేరే!.. మీటింగ్ ఇన్‌సైడ్ మేట‌ర్ ఇదే!

posted on: Feb 11, 2022 12:25PM

వారెవా.. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో జ‌గ‌న్నాట‌కం ర‌క్తి క‌ట్టింది. రాజ‌మౌళి సినిమాను మించిన డ్రామా న‌డిచింది. ఆ టాప్ హీరోల‌కంటే జ‌గ‌న‌న్నే బాగా న‌టించి.. మెప్పించార‌ని తెలుస్తోంది. తాడేప‌ల్లి స్క్రీన్‌ప్లేలో.. ఈ సినిమా వాళ్లంతా త‌మ‌కు తెలీకుండానే పాత్ర‌ధారులుగా మారిపోయార‌ని అంటున్నారు. లోప‌ల జ‌రిగింది వేరైతే.. బ‌య‌ట‌కు వ‌దిలిన రీల్స్ వేరేనంటూ.. అస‌లు విష‌యం ఆల‌స్యంగా వెలుగుచూస్తోంది. ఇంత‌కీ, ప్యాలెస్‌లో ఏం జ‌రిగింది? జ‌గ‌న్‌తో టాలీవుడ్ ప్ర‌ముఖుల మీటింగ్ ఎలా న‌డిచింది?

ఆ మీటింగ్ వ‌చ్చిన‌.. పిలిపించిన వారిని చూస్తేనే అర్థ‌మైపోతుంది జ‌గ‌న్నాట‌కం ఎలా ర‌చించ‌బ‌డిందో. జ‌గ‌న్‌తో మీటింగ్‌లో ఓవైపు మెగాస్టార్, టాలీవుడ్ బిగ్‌బాస్‌ చిరంజీవి. మ‌రోవైపు, చిరును, ఆయ‌న‌ త‌ల్లి అంజ‌నాదేవిని తిట్టిపోసిన పోసాని. ఆ ఫ్రేమ్ చూస్తే అర్థ‌మైపోలా.. జ‌గ‌న‌న్న అస‌లు ఉద్దేశ్యం ఏంటో. కావాల‌నే త‌మ పార్టీ వాడైన‌ పోసానికి ఆ భేటీకి పిలిపించి.. చిరంజీవిని జ‌గ‌న్ అవ‌మానించార‌ని తెలిసిపోవ‌ట్లే. ఆ స‌మావేశంలోనూ ముందే రెడీ చేసిన స్క్రిప్ట్ ప్ర‌కారం.. పోసాని చేత ప‌రోక్షంగా సినీ పెద్ద‌ల‌ను తిట్టించార‌ని తెలుస్తోంది. పోసాని త‌న‌దైన స్టైల్‌లో రెచ్చిపోతుంటే.. జ‌గ‌న‌న్న మ‌ధ్య‌లో జోక్యం చేసుకొని ఆయ‌న్ను కంట్రోల్ చేస్తున్న‌ట్టు చాలాబాగా యాక్ట్ చేశార‌ని అంటున్నారు. అయినా, పోసాని బాగా ఎమోష‌న‌ల్ కావ‌డంతో.. ఆయ‌న్ను మీటింగ్ నుంచి ప‌క్క‌కు పంపించి.. చిరు అండ్ గ్రూప్‌తో సీఎం జ‌గ‌న్ సెప‌రేట్‌గా మాట్లాడార‌ని స‌మాచారం. పోసాని లాంటి.. సినిమాలు లేని, నోరు అదుపులో ఉండ‌ని వ్య‌క్తిని పిల‌వ‌డం.. ఆయ‌న‌తో తిట్టించ‌డం.. ఆయ‌న్ను ఈయ‌న కంట్రోల్ చేసిన‌ట్టు న‌టించ‌డం.. అబ్బో జ‌గ‌న‌న్న స్క్రిప్ట్ మామూలుగా లేదంటున్నారు. 

ఇక‌, తాడేప‌ల్లి మీటింగ్‌లో అంద‌రికంటే చిరంజీవికే ఎక్కువ అవ‌మానం జ‌రిగింద‌ని అంటున్నారు. స‌మావేశం లోపలే కాదు.. ముగిశాక బ‌య‌ట‌కు వ‌దిలిన వీడియోలూ ఉద్దేశ్య‌పూర్వ‌కంగానే ఎడిట్ చేసి రిలీజ్ చేశార‌ని అంటున్నారు. ఆ వీడియోలో చిరంజీవి జ‌గ‌న‌న్న‌ను వేడుకుంటున్న‌ట్టు.. మీ చ‌ల్ల‌ని చూపు కావాలంటూ.. తండ్రిలాంటి మీకు చేతులు జోడించి అడుగుతున్నానంటూ.. మెగాస్టార్ అంత‌టివారు దేహీ అన్న‌ట్టు వేడుకుంటున్న వీడియో క్లిప్పింగ్‌ను కావాల‌నే తాడేప‌ల్లి వ‌ర్గాలు లీక్ చేశాయ‌ని అంటున్నారు. ఆ మీటింగ్‌లో చిరంజీవి ఇంకా చాలానే మాట్లాడారు. కానీ, ఆయ‌న స్పీచ్‌ను ముక్క‌లు ముక్క‌లు చేసి.. ఇలా వేడుకునే బైట్ క‌ట్ చేసి.. మెగాస్టార్ ప‌రువు తీశార‌ని.. ఆయ‌న్ను అవ‌మానాల‌కు గురి చేశార‌ని అంటున్నారు. ఆ వెంట‌నే ఆర్జీవీ చిరంజీవిని మెగా బెగ్గింగ్ అంటూ కించ‌ప‌ర‌చ‌డం.. అంతా ప్రీప్లాన్డ్‌గానే జ‌రిగిందా? అనే డౌట్‌. చిరును పవ‌న్‌తో పోల్చి.. మెగాస్టార్ ఇమేజ్‌ను త‌గ్గించి.. ఫ్యాన్స్ మ‌ధ్య చీల‌క తీసుకొచ్చే స్కెచ్ దాగుందా? అనే అనుమానం. ఆ స‌మావేశం అంతా సాఫీగానే జ‌రిగితే.. ఆ మీటింగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేయొచ్చుగా.. కావల‌సిన క‌ట్‌లతో, చిరు చేతులు జోడించి దండంపెట్టే వీడియోల‌ వెనుక కుట్ర దాగుంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. 

ఇక టికెట్ రేట్లు త‌గ్గించి.. సినీ ఇండ‌స్ట్రీని తీవ్ర మ‌నోవేధ‌న‌కు గురిచేసి.. ప‌రిశ్ర‌మ‌ను ఆగ‌మాగం చేసిన జ‌గ‌న‌న్న‌.. ఇప్పుడు ఆయ‌న పెట్టిన వాత‌ల‌పై అయింట్‌మెంట్ పూసే ప్ర‌య‌త్నమూ బాగానే చేశారు. టాలీవుడ్‌కు క్రీం బిస్కెట్లే వేశార‌ని అంటున్నారు. విశాఖ‌కు రండి.. సినిమాలు తీయండి.. మీకు భూములిస్తా.. కావాల్సిన సాయం చేస్తే.. అంటూ అదేదో ఆయ‌న జేబులోంచి తీసిచ్చిన‌ట్టే చెప్పేశారు జ‌గ‌న్‌రెడ్డి. భూముల‌న‌గానే సినిమా వాళ్లు తోకూపుకుంటూ వ‌చ్చేస్తార‌నుకున్నారో ఏమో..అంటున్నారు. ఇక‌, కావాల‌నే, పొలిటిక‌ల్ అడ్వాంటేజ్ రావాల‌నే.. వైజాగ్‌లో భూములిస్తా.. ఇళ్లు ఇస్తా.. స్టూడియోలు క‌ట్టండి.. సినిమాలు తీయండి.. అనే జ‌గ‌న్ వ‌ర్ష‌న్ వీడియో మాత్ర‌మే ట్రైల‌ర్‌గా వ‌దిలార‌ని అంటున్నారు. 

ఇక‌, టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు తాడేప‌ల్లి ప్యాలెస్‌లో క‌నీస మ‌ర్యాద‌లు కూడా ద‌క్క‌లేద‌ని తెలుస్తోంది. అంత పెద్ద హీరోలు, డైరెక్ట‌ర్లు వ‌చ్చినా.. కారును దూరంగానే ఆపేశారు. న‌డిపించుకుంటూ తీసుకెళ్లారు. క‌నీసం గేట్ ద‌గ్గ‌ర ఓ పూల‌బొకే కానీ, రిసీవ్ చేసుకోవడాలు కానీ జ‌ర‌గ‌లేద‌ని చెబుతున్నారు. ముందే అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయినా.. భేటీకి ముందు కాసేపు వారంద‌రినీ వెయిట్ చేయించిన‌ట్టు స‌మాచారం. ఇక మీటింగ్ ముగిశాక కూడా.. ఎండ‌లో నిల‌బ‌డితే కందిపోయే టాప్ హీరోల‌తో.. కావాల‌నే అలా ఆరుబ‌య‌ట‌ ఎండ‌లో ప్రెస్‌మీట్ పెట్టించార‌నే విమ‌ర్శ ఉంది. ఇక‌, స‌రిగ్గా లంచ్ టైమ్ వ‌ర‌కూ ఆ భేటీ జ‌రిగినా.. కనీసం వ‌చ్చిన సినీ ప్ర‌ముఖుల‌కు క‌నీసం భోజ‌నం కూడా పెట్ట‌క‌పోవ‌డం దారుణం అంటున్నారు. జ‌గ‌న‌న్న లంచ్ ఏర్పాటు చేయ‌క‌పోవ‌డంతో.. తామంతా ఆక‌లితో ఇబ్బంది ప‌డ్డామ‌ని వాళ్లంతా త‌మ‌ స‌న్నిహితుల‌తో ద‌గ్గ‌ర వాపోయారు. 

ఇక ఇవ‌న్నీ కామ‌నే అనుకున్నారో.. జ‌గ‌న‌న్న ముందు తామెంత అనుకున్నారో.. మీటింగ్ ముగిసి ఎవ‌రి దారిన వారు వెళ్లిపోయాక‌.. ఇక ట్విట్ట‌ర్‌లో పొగ‌డ్త‌లు స్టార్ట్ చేశారు. తాడేప‌ల్లి డైరెక్ష‌నో, లేక ముందే డిసైడ్ అయ్యారో ఏమో.. ఎవ‌రికి వారు మీటింగ్ బాగా జ‌రిగింద‌ని.. జ‌గ‌న్‌రెడ్డి ఆహో..ఓహో అంటూ ట్వీట్ల వ‌ర్షం కురిపించారు సినిమా పెద్ద‌లు. అంత‌లా ఏం గుడ్‌న్యూస్ ఉంద‌నో ఇంత ఆనందం అంటున్నారు ఫ్యాన్స్‌. త‌గ్గించిన టికెట్ రేట్ల‌ను మ‌ళ్లీ క‌వ‌ర్ చేస్తానన్నందుకా?  లేక‌, మీ పెద్ద‌ల‌కు విశాఖ‌లో భూములు ఇస్తాన‌న్నందుకా?  మీటింగ్‌తో ఏం సాధించార‌ని ఆ పెద్ద‌లు మ‌రీ ఇంత‌లా జ‌గ‌న్ భ‌జ‌న చేస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...