దావోస్ లో జగన్ బృందం మాటల కోటలు.. దరి చేరని పారిశ్రామిక వేత్తలు!

posted on: May 23, 2022 5:56PM

దావోస్ లో జగన్ తనకు అలవాటైన అబద్ధాల ప్రచారాన్ని మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నారు. వాస్తవానికి దావోస్ లో ఏపీ ఉనికిని గుర్తించేందుకు కూడా పారిశ్రామిక వేత్తలు ముందుకు రాని పరిస్థితి ఉంది. కానీ ఏపీలో లాగే దావోస్ లో కూడా జగన్ అబద్ధాల తెర వెనుక గడిపేస్తున్నారు. దావోస్ లో ఏపీ వైపు చూసిన పారిశ్రామిక వేత్తలే లేరంటే అతిశయోక్తి కాదు. అసలు దావోస్ కు జగన్ పర్యటన పెట్టుబడుల కోసం కాదనీ, వేరే వ్యక్తిగతమైన వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు విదేశీ పర్యటన కోసమే దావోస్ ను ఒక సాకుగా చూపారనీ తొలి నుంచీ విమర్శలు వస్తునే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన దావోస్ చేరుకోవడానికి ముందు లండన్ లో ల్యాండ్ కావడం ఆ విమర్శలకు బలం చేకూర్చింది. అలాగే జగన్ దావోస్ కు బయలుదేరడానికి చాలా రోజుల ముందుగానే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి  గుడివాడ అమర్నాథ్ కుండ బద్దలు కొట్టేశారు. జగన్ దావోస్ ఆర్థిక సదస్సులో పాల్గొన్నంత మాత్రాన పెట్టుబడులు వచ్చి పడిపోతాయన్న భ్రమలు వద్దని ఆయన ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశారు.

అయితే దావోస్ లో జగన్, ఆయన వెంట వెళ్లిన బృందం మాత్రం ఏపీకి  అక్కడ పారిశ్రామిక వేత్తలు బ్రహ్మరథం పట్టేస్తున్నారన్నట్టు బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ దావోస్ లో  జగన్ బృందంతో చర్చలు జరిపిన కంపెనీ ఏదయ్యా అంటే.. మూడు రాజధానుల మాటకు జగన్ కు వంత పాడిన బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ (బీసీజీ). ఈ బీసీజీ గ్రూప్ కొత్తదేం కాదు. ఏపీలో ఆ గ్రూప్ తన తీరుతో ఎంతగా భ్రష్టుపట్టిందో అందరికీ తెలిసిందే. మూడు రాజధానుల కోసం జగన్ నియమించుకున్నది ఆ గ్రూప్ నే. ఆ గ్రూపు నివేదిక ఇవ్వడానికి ముందే.. జగన్ నోటి వెంట మూడు రాజధానుల నిర్ణయం వెలువడింది. ఆ తరువాత తీరిగ్గా బీసీజీ గ్రూపు జగన్ చెప్పిన మాటలను చిలకలా వల్లె వేసింది. బీసీజీ గ్రూపు మూడు రాజధానులకు అనుకూలంగా ఇచ్చిన నివేదికపై చాలా మంది కోర్టుకు వెళ్లారు. మరింత మంది పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టారు.

ఇప్పుడు దావోస్ లో ఆ సంస్థ చైర్మనే పాత పరిచయంతో జగన్ తో భేటీ అయ్యారు. మూడు రాజధానులకు అనుకూలంగా నివేదిక ఇచ్చినట్లుగానే... ఇక్కడ కూడా జగన్ ఏం కావాలో అదే మాట్లాడారు.  ఏపీ ప్రభుత్వ పారిశ్రామిక విధానం భవిష్యత్ లో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తడానికి దోహదపడుతుందన్నది బీసీజీ గ్రూప్ చైర్మన్ ప్రసంగ సారాంశం. ఇక దావోస్ లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ను డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్ మాత్రమే. అలాగే ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కూడా జగన్ తో భేటీ అయ్యారు.

 వీరి మధ్య పెట్టుబడుల అంశం కాకుండా గౌతమ్ అదానీ భార్యకు జగన్ ఇవ్వచూపిన రాజ్యసభ టికెట్ ను నిరాకరించడంపైనే చర్చ జరిగిందన్నది వైసీపీ వర్గాల కథకం. వీరు కాకుండా జగన్ కేసి కానీ, ఏపీ వైపు కానీ చూసిన పారిశ్రామిక వేత్త లేరు. అయినా జగన్ బృందం జగన్ దావోస్ పర్యటనను ఆహా, ఓహోలతో పొగిడేస్తూ లేని సీన్ ఉందని నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...