ఫోన్ వాడొద్దన్నందుకు..మేజర్‌ని కాల్చేశాడు

అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతూ ఉంటుంది భారత సైన్యం. అయితే విధి నిర్వహణలో సైనికులు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి సెల్‌ఫోన్ వినియోగం..భద్రతాపరమైన కారణాల దృష్ట్యా సైన్యం మొబైల్ ఫోన్లను వాడకూడదన్నది నిబంధన. ఇదే ఇప్పుడు ఓ ఆర్మీ మేజర్ ప్రాణాలు పోవడానికి కారణమైంది. జమ్మూకశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ జవాన్ సెల్‌ఫోన్ వినియోగిస్తున్నాడు..దీనిని గమనించిన మేజర్ శిఖర్ తాపా...ఇలాంటి సున్నితమైన ప్రాంతంలో ఫోన్ వినియోగించరాదని మందలించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి సెల్‌ను సైనికుని వద్ద నుంచి తీసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోని పెనుగులాడారు. ఈ క్రమంలో ఫోన్ కిందపడి దెబ్బతింది.. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ జవాను తన చేతిలోని ఏకే-47తో మేజర్ కాల్పులు జరిపాడు..దీంతో ఆ మేజర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు..కాల్పుల శబ్ధం విని పరిగెత్తుకొచ్చిన తోటి సిబ్బంది సదరు సైనికుడిని అదుపులోకి తీసుకున్నారు.