TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెండో టెస్టులోనూ విండీస్ ఓటమి.. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా

Published on: Tue Oct 14, 2025 11:12AM

వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆటలోని అన్ని విభాగాల్లోనూ పూర్తి సాధికారత ప్రదర్శించిన శుభమన్ గిల్ సేన విండీస్ ను రెండు టెస్టుల్లోనూ చిత్తుచిత్తుగా ఓడించింది. మంగళవారం (అక్టోబర్ 14) ముగిసిన రెండో టెస్టులో టీమ్ ఇండియా విండీస్ పై ఏడు వికెట్ల ఆధిక్యతతో గెలుపొందింది.  121 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా నాలుగో రోజు ఆటముగిసే సరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమ్ ఇండియా ఎక్కువ సమయం తీసుకోకుండానే లక్ష్యాన్ని ఛేదించేసింది. రాహుల్  58 నాటౌట్, జురేల్ 6 నాటౌట్ గా ఉన్నారు. చివరి రోజు ఆట ఆరంభమైన తరువాత సాయిసుదర్శన్ 39, శుభమన్ గిల్  13 ఔటైనా లక్ష్యం మరీ చిన్నది కావడంతో టీమ్ ఇండియా అలవోకగా దానిని ఛేదించి విజయం సాధించింది.  

రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తరువాత విండీస్ తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్ల ధాటికి కేవలం 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఫాలో ఆన్ ఆడిన విండీస్ రెండో ఇన్నింగ్స్ లో 390 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ కు121 పరుగుల సల్ప విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.