TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు.. పేర్ని నానిపై కేసు

Published on: Wed Jan 28, 2026 6:11AM

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది.   ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో త్వరలో పేర్నికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. వైసీపీలో ఒకింత యాక్టివ్ గా ఉన్న కొద్ది మంది నేతలలో ఒకరైన పేర్ని నాని దూకుడుకు కళ్లెం పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

  ఏలూరు జిల్లా చాట్రాయిలో రెండు రోజుల కిందట జరిగిన  వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో  పాల్గొన్న పేర్ని చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ పై  అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. దీనిపై  ఆయన స్వస్థలం బందరులో టీడీపీ శ్రేణులు ఫైర్ అయ్యాయి. స్థానిక ఇనగుదురుపేట పీఎస్ లో టీడీపీ నేతలు పేర్నినాని వ్యాఖ్యలపై  ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు పేర్ని నానిపై బీఎన్ఎస్ సెక్షన్లు 196(1), 353(2), 351(2), 352 కింద కేసు నమోదు చేశారు. 

కాగా, గతంలోనూ పేర్నినాని వివిధ సందర్భాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు కూడా.  కానీ ఈసారి   పేర్నినాని చేసిన కామెంట్స్ పై టీడీపీ, జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి.  పేర్ని నానిపై చర్యలు తీసుకోవలసిందేనని పట్టుబడుతున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా ఇష్టారీతిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సీరియస్ గా ఉంది. ప్రస్తుతం వైసీపీలోలో యాక్టివ్ గా ఉన్న అతి తక్కువ మంది నాయకులలో ఒకరైన పేర్ని నాని వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీంతో తాజాగా నమోదైన కేసు విషయంలో పోలీసులు చర్యలకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుతో ఆయన చిక్కుల్లో పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.