Latest News
హైదరాబాద్ లో మెట్రో రైల్ బంద్
posted on: Jun 17, 2022 3:10PM
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆందోళనల కారణంగా హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు బంద్ అయ్యాయి. నగరంలోని మూడు రూట్లలో కూడా మెట్రో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు మెట్రో రైలు ఒక ప్రకటనలో తెలిపింది. మెట్రో సర్వీసులు ఎప్పటి నుంచి పునరుద్ధరంచేదీ తరువాత తెలియజేస్తామని పేర్కొంది.
ఈ ప్రకటన వెలువడడానికి ముందే నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలోకి ప్రవేశాన్ని నిలిపివేసి గెట్లు, షట్లర్లు మూసేశారు. ఎలాంటి ముందస్తు సమాచారంలేకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అదలా ఉంటే ఎంఎంటీఎస్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికిందరాబాద్ స్టేషన్లో విధ్వంసం కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులను నిలిపివేసినట్లు పేర్కొంది. ఇక సికింద్రాబాద్ అల్లర్లతో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరిన్ని రైళ్లను దారి మళ్లించింది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వెళ్లే దారులన్నీ మూసేశారు. బస్సులను సైతం స్టేషన్ వైపునకు అనుమతించడం లేదు. ఇక రాష్ట్రంలోని ప్రధాన స్టేషన్లైన కాజీపేట, వరంగల్, జనగామ, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో పోలీసులు భారీగా మోహరించారు. అనుమానితులను లోపలికి అనుమతించడం లేదు.






