పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. రేవంత్ రెడ్డి విడుదల

 

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేసారంటూ కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పోలింగ్‌ సమీపిస్తున్న సమయంలో కొడంగల్‌ అభ్యర్థిగా ఉన్న రేవంత్‌ రెడ్డిని పోలీసులు ఎక్కడ ఉంచారో కూడా తమకు సమాచారం లేదని, ఆయన ఎక్కడ ఉన్నా కోర్టులో హాజరు పరచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసీఆర్‌ పర్యటన సందర్భంగా రేవంత్‌ రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారని, శాంతిభద్రతల దృష్ట్యా ఆయనను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. బంద్‌కు రేవంత్‌ పిలుపునిస్తే తప్పేంటని, ఆయనను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్ని నియంత్రించారని ప్రశ్నించింది. ఒకవేళ రేవంత్‌ను అరెస్టు చేయకపోతే శాంతిభద్రతల సమస్య వస్తుందని ఏ విధంగా పోలీసులు అంచనాకు వచ్చారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్‌ సమాచారం నివేదిక ఆధారంగానే రేవంత్‌ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పగా.. ఆ నివేదిక ఏంటో, దానిలో ఏముందో ఆ వివరాలను తమ ఎదుట ఉంచాలని ఆదేశిస్తూ అందుకు అరగంట సమయం ఇచ్చింది. 

గడువు అనంతరం మరోసారి విచారణలో రేవంత్‌ను ఈ సాయంత్రం 4.30గంటల తర్వాత విడుదల చేస్తామని పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు సమర్పించేందుకు తమకు సమయం కావాలని కోరారు. దీనికి సంబంధించిన ఆధారాలు రేపు సమర్పిస్తామని పోలీసులు గడువు కోరగా.. పోలీసుల తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ ఆయన అరెస్టు సక్రమంగా ఉంటే ఆధారాలు ఇవ్వడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించింది. ఈ రోజే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, కారణాలు తమకు చెప్పాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అవసరమైతే మరో గంట సమయం ఇస్తామని పేర్కొంటూ.. విచారణను సాయంత్రం 4.30 గంటలకు వాయిదా వేసింది. పోలీసుల తరఫు న్యాయవాదిపై హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి నేరుగా అడ్వొకేట్‌ జనరల్‌ వచ్చి వాదనలు విన్పించాలని ఆదేశించింది.

ఒక పక్క హైకోర్టులో విచారణ జరుగుతున్న ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ లేఖ రాశారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయండని ఆదేశించారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేతల వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకున్న రజత్ కుమార్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.