భార్యాభర్తల బంధం బాగుండటానికి సాక్షాత్తు సీతారాములు చెప్పిన సలహాలు ఇవి..!

posted on: Oct 1, 2025 1:09PM


భారతీయ సంస్కృతిలో సీతారాముల వివాహం అయినా, వారి బందం అయినా కేవలం ఒక మతపరమైన సంఘటన మాత్రమే కాదు, ఆదర్శవంతమైన వైవాహిక జీవితానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. రాముడు,  సీత మధ్య సంబంధం త్యాగం, నమ్మకం, గౌరవం,  అంకితభావం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నేటికీ సంబంధాలను బలోపేతం చేయడానికి మూలంగా నిలుస్తుంది. నేటికాలంలో విభేదాలు,  స్వార్థం కారణంగా సంబంధాలు తరచుగా బలహీనపడతాయి. సీతారాముల  వైవాహిక జీవితం ప్రేమ,  నమ్మకంతో ప్రతి సవాలును ఎదుర్కోవచ్చని  బోధిస్తుంది.


బంధం బలంగా ఉండటానికి సీతారాములు చెప్పిన సలహాలు..

నమ్మకమే పునాది..

రాముడు,  సీత ఒకరికొకరు  నమ్మకాన్ని ఇచ్చుకున్నారు. రాముడితో పాటు వనవాసానికి వెళ్లడానికి సీత ముందుకువచ్చింది. అడవిలో అయినా సరే తన భర్త తనకు రక్షణ ఇవ్వగలడని సీతమ్మ నమ్మింది.  రాముడు తన భార్య గౌరవం,  భద్రతను అన్ని పరిస్థితులలోనూ చూసుకున్నాడు.

కష్టాలలో కూడా కలిసి ఉండటం..

సీతారాముడి జీవితాలు పోరాటాలతో నిండి ఉన్నాయి. వనవాసానికి వెళ్లడం, యుద్ధం, అగ్ని పరీక్షలు అనుభవించారు. కానీ ఏ కష్టం వచ్చినా ఒకరిని ఒకరు వదులుకోవాలని అనుకోలేదు. కష్ట సమయాల్లో ఒకరికొకరు మద్దతుగా ఉండటం  గొప్ప బలం అని వారు చెప్పకనే చెప్పారు.

సంబంధంలో గౌరవం..

రాముడిని మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు.  కుటుంబం, సమాజం,  మతం  పరిమితులను ఎప్పుడూ పాటించాలని అనుకున్నాడు. క్రమశిక్షణ,  మర్యాదలకు కట్టుబడి ఉన్నప్పుడే సంబంధాలు విజయవంతమవుతాయని తన జీవితం ద్వారా నిరూపించాడు.

త్యాగం, అంకితభావం..

సీతమ్మ తల్లి తన సొంత సుఖాలను త్యాగం చేసి రాముడితో వనవాసాన్ని ఇష్టపూర్వకంగా ఎంచుకుంది. సీతమ్మను వనవాసానికి వెళ్లమని ఎవరూ బలవంతం చేయలేదు.   ఈ త్యాగం ఇప్పటికీ  సంబంధాలు స్వార్థం మీద కాదు, నిస్వార్థత మీద నిలబడి ఉంటాయని బోధిస్తుంది.

ప్రాధాన్యత..

రాముడు,  సీత ఒకరి కోరికలను, భావాలను పరస్పరం గౌరవించుకున్నారు. దీర్ఘకాలిక సంబంధానికి పరస్పర గౌరవం చాలా ముఖ్యం. సీత  రాముడి గౌరవార్థం  రాజభవనాన్ని విడిచిపెడితే.. రాముడు రాజు అయినప్పటికీ సీతమ్మ తల్లి కోసం రావణుడితో యుద్దమే చేశాడు. సీతమ్మ కోసం తానే నేరుగా లంకకు వెళ్ళాడు.

                              *రూపశ్రీ.

google-ad-img
    Related Sigment News
    • Loading...