Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కుప్పంలో యాపిల్ ఐఫోన్ విడిభాగాల తయారీ సంస్థ!
posted on: Aug 28, 2025 3:29PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రప్రగతికి విషయంలో ఏ ఒక్క అవకాశాన్నీ వదలడం లేదు. అలాగే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో అనితర సాధ్యమన్న రీతిలో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పానికి భారీ పెట్టుబడితో హిందాల్కో సంస్థ రానున్నది.
అది ఇలాంటి అలాంటి ప్రాజెక్టుతో కాదు. ఏకంగా ఐ ఫోన్ విడిభాగాల తయారీలో కీలకం అయిన ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్ ట్రేషన్ ఫెసిలిటీని కుప్పంలో ఏర్పాటు చేయడానికి హిందాల్కో ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. కుప్పంలో హిందాల్కో ఉత్పత్తి చేసే అల్యూమినియంను ఐఫోన్ విడి భాగాల తయారీకి ముడి సరుకుగా సరఫరా చేయడమే లక్ష్యం.ఇందు కోసం హిందాల్కో కుప్పంలో ₹586 కోట్ల పెట్టుబడితో సంస్థను ఏర్పాటు చేయనుంది. ఐఫోన్ విడిభాగాల తయారీకి ముడి సరుకు సరఫరా యూనిట్ ఏర్పాటుతో కుప్పం యాపిల్ ఐఫోన్ తయారీ చైన్ లో భాగం కానుంది.
కుప్పంలో హిందాల్కో ప్రాజెక్టు నకు రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) అతి త్వరలో ఆమోదిస్తుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి అవుతుందనడంలో సందేహం లేదంటున్నారు అధికారులు. ఈ భారీ ప్రాజెక్టుకు ఆ సంస్ధ కుప్పంనే ఎన్నుకోవడానికి అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడమే కాకుండా.. బెంగళూరు, చెన్నై మెట్రో నగరాలకు సమీపంగా ఉండటం కూడా ఒక కారణం. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ ప్రాజెక్టు 2027 నాటికి సాకారం అవుతుంది. అంతే కాదు ప్రత్యక్షంగా వేయి మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని చెబుతున్నారు.






