కరోనా మెడిసిన్ పై మంచి నిర్ణయం తీసుకున్న హెటిరో.. కరోనా బాధితులకు ఊరట 

కరోనా వైరస్ సోకి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న రోగులకు డాక్టర్లు రెమ్‌డెసివిర్ మెడిసిన్ వాడాలని ప్రిస్క్రిప్షన్ లో రాస్తున్నారు. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఈ మందును కొంత మంది బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. దీంతో ఒక ఇంజెక్షన్ ధర రూ 5400 ఐతే బ్లాక్ మార్కెట్ లో మాత్రం రూ 30 వేలకు పైగా ధరతో అమ్ముతున్నారు. ఒక్కో పేషేంట్ కు డాక్టర్లు జనరల్ గా దాదాపుగా ఆరు ఇంజెక్షన్లు డోస్ ప్రిస్క్రైబ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇంజెక్షన్ల ఖర్చే లక్షలలోకి వెళుతోంది. దీంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ రెమ్‌డెసివిర్ మెడిసిన్ ను ఇంజెక్షన్ రూపంలో హైదరాబాద్ లోని హెటిరో సంస్థ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే హెటిరో కంపెనీ మాత్రం తాము బాగానే సప్లై చేస్తున్నామని చెబుతోంది. కానీ ఆస్పత్రుల్లోని ఫార్మసీల్లో మాత్రం ఈ మందు దొరకడం లేదు.

ఇటువంటి పరిస్థితుల్లో హెటిరో సంస్థ ఒక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని Y జంక్షన్ దగ్గర ఆ సంస్థ ఒక ప్రత్యేక కౌంటర్ తెరిచింది. అక్కడ తాను తయారుచేస్తున్న కోవిఫర్‌ మందును అసలు ధరకే కొనుక్కోవచ్చని ఆ సంస్థ తెలిపింది. అయితే ఈ మందు కావాలంటే మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాలి.