Latest News

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

posted on: Aug 16, 2025 9:46AM

 

ఉభయ తెలుగు రాష్ట్రాలనూ భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రాష్ట్రాలూ చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వడం లేదు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వార్షాల కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలలో వాగులు, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇలా ఉండగా శనివారం (ఆగస్టు 16) కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో  కురుస్తున్న భారీ వర్షాలు మరో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని  పేర్కొంది. ఈ  నేపథ్యంలోనే శనివారం  (ఆగస్టు 16) రాష్ట్రంలోని పలు జిల్లాలలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.  హైదరాబాద్ మహానగరంలో ఉదయం నుంచీ ముసురు పట్టి ఉంది. కొన్ని  ప్రాంతాలలో వర్షం పడుతోంది.

అలాగే నిర్మల్, నిజామాబాద్, జయంశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డితో పాటు సిరిసిల్ల జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న  వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ పలు జిల్లాలలో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ముఖ్యంగా  శ్రీకాకుళం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం జిల్లాలలో వర్షం ముప్పు అధికంగా ఉందని హెచ్చరించింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...